రామచంద్రాపురం, సెప్టెంబర్ 1: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది. కొల్లూర్ పరిధిలో నిర్మించిన ఫేజ్-1 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో, ఫేజ్-2 కేసీఆర్నగర్ రెండు ప్రాజెక్టుల్లో మొత్తం 3500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించనున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని వారికి ఇండ్లను మంజూరు చేశారు. శనివారం కొల్లూర్లో ఉదయం 11గంటలకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేసి వారితో సామూహిక గృహప్రవేశాలు చేయించనున్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్లను సందర్శించారు. అనంతరం మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ, సంగారెడ్డి జిల్లా అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. డయాస్, సిట్టింగ్ తదితర పనులను బాధ్యతగా చేపట్టాలన్నారు. లబ్ధిదారులు సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, కళాజాత కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య సిబ్బందికి సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు వెంకటేశ్, స్నేహలతో కలిసి కలెక్టర్ శరత్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్రావు, డీపీవో సురేశ్మోహన్, ఏపీడీ జయదేవ్, డీసీవో ప్రసాద్, మెప్మా పీడీ గీత, డిప్యూటీ కలెక్టర్లు రాధాబాయ్, మహిపాల్రెడ్డి, ఆర్డీవో రవీందర్రెడ్డి, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.