మెదక్, మార్చి 4 (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి, కలెక్టరేట్: మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఈ నెల 8న మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభించనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రతి మంగళవారం ఈ కేంద్రాల్లో మహిళలకు పరీక్షలు చేసి, తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సీఎస్ శాంతికుమారితో కలిసి ఆరోగ్య మహిళ, సీపీఆర్ శిక్షణ, కంటి వెలుగు, వడ్డీ లేని రుణాలు తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ అందించాలన్నారు. హెల్త్వరర్స్, స్వశక్తి మహిళా సంఘాలు, ఆర్టీసీ, పోలీస్ సిబ్బంది, షాపింగ్మాల్స్, అపార్ట్మెంట్ నిర్వాహకులు, టీచర్లు మొదలగు వర్గాలకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఈనెల 13 నుంచి సీపీఆర్ శిక్షణ ప్రారంభించాలన్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని మంత్రి తెలిపారు. జిల్లాలో సీపీఆర్ శిక్షణ అందించేందుకు ప్రతి జిల్లాకు 5 నుంచి ఏడుగురు మాస్టర్ ట్రైయినర్లను అందుబాటులో ఉంచి, రోజూ కనీసం 300 మందికి శిక్షణ అందించేలా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రెండో విడత కంటి వెలుగులో జిల్లాలో ప్రిస్రిప్షన్ కండ్లద్దాలను సకాలంలో అందజేయాలన్నారు. రోజూ ప్రతి శిబిరానికి కనీసం 100 మంది వచ్చేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని తెలిపారు.
100 ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు
ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ముందస్తుగా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరింతగా విస్తరిస్తామన్నారు. ప్రతి మంగళవారం 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానల్లో మహిళల కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ క్లినిక్లో మహిళలకు 8 ప్యాకేజీలో 57 రకాల పరీక్షలు చేస్తారన్నారు. ప్రాథమిక డయాగ్నస్టిక్, క్యాన్సర్ స్రీనింగ్, వెయిట్ మేనేజ్మెంట్, మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, పీసీవోడీ, రుతుస్రావ సమస్యలు, ఇన్ ఫెర్టిలిటీ మేనేజ్మెంట్, మెనోపాజ్ మేనేజ్మెంట్, ఐవీ, యూటీఐ& పెల్విక్ ఇన్ ఫ్లమెంటరి డిసిజెస్ వంటి అంశాలు పరీక్షిస్తారన్నారు. మహిళల్లో పోషకాల లోపం నివారణ కోసం క్లినిక్లో డీ3, బీ12 తో పాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అవసరమైన మందులు ఉచితంగా అందిస్తామన్నారు. మహిళా క్లినిక్లో క్యాన్సర్ స్రీనింగ్ చేస్తారని, అనుమానితులు, లక్షణాలున్న వారికి జిల్లా స్థాయిలో మామోగ్రామ్, బయాప్సి, పాప్స్ మీర్, కోల్పోసోపి పరీక్షలు చేస్తారన్నారు. క్యాన్సర్ నిర్ధారణ అయితే నిమ్స్ ఎంఎన్జేలో చికిత్స అందిస్తారన్నారు. మహిళా క్లినిక్కు వచ్చే పేషెంట్ల వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారన్నారు. వీటిని రెఫరల్ దవాఖానకు లింక్ చేస్తామని, జిల్లా దవాఖానలో ఇబ్బందులు కలుగకుండా హెల్ప్డెస్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
రూ.650 కోట్లు విడుదల
రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న వడ్డీ లేని రుణం బకాయిలు రూ.650 కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయి వేడుకల్లో గ్రామీణ సంఘాలు, మెప్మా సంఘాలకు చెక్లు అందించాలన్నారు. జిల్లాలో త్వరితగతిన సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులు, ఇతర మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు.
జీవో 58 కింద 151 దరఖాస్తులకు ఆమోదం: మెదక్ కలెక్టర్ రాజర్షి షా
అనంతరం మెదక్ కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జీవో 58 కింద 151 దరఖాస్తులు ఆమోదించామన్నారు. జీవో 59 కింద 215 దరఖాస్తులు ఆమోదిస్తూ ఒకేసారి డబ్బు చెల్లిస్తే 5 శాతం రిబేటు ఇస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి రుసుము వసూలు చేస్తామన్నారు. అర్హులైన 492 మంది గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంతవరకు 186 గ్రామ పంచాయతీలు, 34 మున్సిపల్ వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి 1,84,411 మందికి కంటి పరీక్షలు చేసి 22,454 రీడింగ్ అద్దాలు, 7,184 మందికి ప్రిస్రిప్షన్ అద్దాలు అందజేశామన్నారు. హరితహారం కింద 36 లక్షల మొకలు నాటేందుకు శాఖల వారీగా కార్యాచరణ రూపొందించామన్నారు. కాన్ఫరెన్స్లో మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో సాయిబాబా, డీఎంహెచ్వో చందు నాయక్, డీసీహెచ్ చంద్రశేఖర్, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, ఆర్డీవోలు సాయి రామ్, శ్యామ్ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్లు జానకీరామ్సాగర్, వెంకట గోపాల్, మోహన్, ఉమాదేవి పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ శరత్
కలెక్టర్ శరత్ మాట్లాడుతూ సీపీఆర్ శిక్షణ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, వడ్డీలేని రుణాలపై మంత్రి, సీఎస్ ఇచ్చిన ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయా కార్యక్రమాలను ప్రణాళికతో నిర్వహిస్తామన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు 4,78,441 మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో 45,700 మందికి రీడింగ్ అద్దాలు, 28,250 మందికి ప్రిస్క్రిషన్ అద్దాలు అందజేసినట్లు వివరించారు. సంగారెడ్డి జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అదనపు ఎస్పీ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, అటవీ శాఖ అధికారి, డీఆర్డీవో, డీపీవో తదితరులు పాల్గొన్నారు.