జమ్మికుంట, ఆగస్టు 7 : ధ్వంసమైన తనుగుల చెక్డ్యామ్కు వెంటనే మరమ్మతు చేయాలని ఇరిగేషన్ అధికారులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో ఇసుక క్వారీలు ఉన్నప్పటికీ అభివృద్ధి, ప్రజా అవసరాలకు ఇసుక అందని పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మికుంట పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల వారీగా మాట్లాడారు.
జిల్లాలో ఆన్లైన్ లేకుండానే ఇసుక ట్రాక్టర్లకు అనుమతలిస్తున్నారని, హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. ఎరువులకు యాప్లను ఎత్తివేయాలని, ఎలాంటి లింకులు లేకుండా డీఏపీని అందించాలని కోరారు. అయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, సాగుతో కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కల్వల ప్రాజెక్టుకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, 12 గంటలు మాత్రమే చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతకుముందు పలు అంశాలకు సంబంధించిన ఎజెండా ప్రతులను ఎంపీడీవో, ప్రజాప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పనితీరుపై పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేయగా, ఆయా శాఖల అధికారుల తీరును మార్చుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ఇక్కడ తహసీల్దార్ సుధాకర్, డీసీసీడీ వైస్చైర్మన్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, సర్పంచులు, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.