హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల జోరుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడం, ఒడిశా తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనంతో వానలు కురుస్తాయని తెలిపింది. రాబోయే మూడు రోజులు హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నైరుతి సీజన్కు సంబంధించి ఇప్పటివరకు 408.9మి.మీ వర్షపాతం కురువాల్సి ఉండగా, 389.7మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇది 5శాతం లోటుగా ఉన్నదని, నిరుటితో పోలిస్తే 7శాతం అధికంగా ఉన్నట్టు చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, వికారాబాద్, మహబూబాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో సిద్దిపేటలో 7.59 సెం.మీ, నారాయణపేటలో 7.57 సెం.మీ, చిన్నకోడూర్లో 7.5 సెం.మీ, సిద్దిపేట రూరల్లో 6.51 సెం.మీ, నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 7.07 సెం.మీ, జక్రాన్పల్లిలో 7.2 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వివరించింది.