న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ సేవపై ఒకే రీతిలో ఉండే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వైద్యవిద్యలో ప్రభుత్వ సబ్సిడీల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, సమాజ సంక్షేమం, దేశ నిర్మాణంలో వైద్యులు కీలక భాగస్వాములని అభిప్రాయపడింది.
కర్ణాటకలో వైద్య విద్యార్థులకు ఏడాది పాటు తప్పనిసరి గ్రామీణ సేవ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం శుక్రవారం విచారించింది. ప్రభుత్వ నిధులతో చదువుకున్నా, లేకపోయినా వైద్య విజ్ఞానమనేది ఒక వనరు అని, దానిని ప్రజాహితం కోసం ఉపయోగించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. ప్రైవేట్ వైద్య విద్యార్థులను ఈ నిబంధన నుంచి ఎందుకు మినహాయించాలని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రం అభిప్రాయాలను కోరాలని సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది.