రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరరీ కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులు ( Sub-Treasury Officers) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ( ACB Raids ) . సస్పెన్షన్ కాలపు జీతం బిల్లులను , పదవీ విరమణానంతర పెన్షన్ సర్దుబాటు బకాయిల మొత్తాన్ని ప్రాసెస్ చేసి, ఫార్వార్డ్ చేసేందుకు ప్రతిఫలంగా ఫిర్యాదుదారుడి నుంచి సబ్ ట్రెజరరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరరీ అధికారి కావలి అనురాధ రూ.2.50 లక్షలు డిమాండ్ చేశారు.
వీటిలో మొదటి విడతగా లక్ష రూపాయలు ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో గురువారం ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. వీరికి మధ్యవర్తిగా ఉన్న వడ్డె జంగయ్య అనే వ్యక్తికి లక్ష రూపాయలు అందించగా వీటిలో రూ.50 వేలు అధికారులు, మిగతా రూ.50 వేలు మధ్యవర్తి లంచంగా తీసుకున్నారు. ముగ్గురు వద్ద నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి నాంపల్లి జుడీషియల్ కోర్టులో హాజరు పరిచినామని ఏసీబీ అధికారులు వివరించారు.