Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. భార్యపై భర్త యాసిడ్తో దాడి చేశాడు. అనంతరం కత్తితో పొడిచి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన బెంగళూరు, జేపీ నగర్ పరిధిలో గురువారం ఉదయం 9.15 గంటలకు జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. పశ్చిమ బెంగాల్కు చెందిన 26 ఏళ్ల మహిళ స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది.
ఉదయం హాస్పిటల్ నుంచి బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వస్తున్న సమయంలో ఆమె భర్త అక్కడికి వెళ్లి ఆమెపై యాసిడ్తో దాడి చేశాడు. దీంతో భయపడి పోయిన ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను భర్త వెంబడిస్తూ వెళ్లాడు. చివరకు బేస్మెంట్లో ఆమెపై కత్తితో దాడి చేశాడు. పలుసార్లు పొడిచాడు. దీంతో తీవ్ర గాయలయ్యాయి. రక్తస్రావం జరిగింది. దగ్గర్లోనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన మహిళను స్తానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఘటన సమయంలో కొందరు అక్కడే ఉన్నా.. అతడిని అడ్డుకుంటే తమపై కూడా కత్తితో దాడి చేస్తారేమోనని భయపడి దూరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరిమధ్యా విబేధాల కారణంగా కొంతకాలంగా విడిగా ఉంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి స్థాయి వివరాలు దర్యాప్తు అనంతరం అందిస్తామని, నిందితుడికి తగిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు వివరించారు.