నేడు జహీరాబాద్కు మంత్రి హరీశ్రావు రాక
రేపు మున్సిపల్లో ‘నగర బాట’
బాగారెడ్డి స్టేడియంలో గోటిగార్పల్లి దళితబంధు యూనిట్ల పంపిణీ
మున్సిపల్లో అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష
జహీరాబాద్, ఏప్రిల్ 17: ఒక్కప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం అంటే వెనుకబడి ప్రాంతం. ఎర్ర మట్టి అంటేనే జహీరాబాద్ అనే వారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వజ్రాలు పండే మట్టిగా గుర్తింపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్తో పాటు నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. ఇటీవల సీఎం కేసీఆర్ జహీరాబాద్ మున్సిపల్కు రూ.50 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు కావడంతో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మాణం చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు సర్వేచేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడు జహీరాబాద్ పట్టణంలో మంత్రి హరీశ్రావు పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
దళిత బంధు యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు..
మొగుడంపల్లి మండలంలోని గోటిగార్పల్లికి చెందిన దళితులకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియం జరుగనున్నది. గోటిగార్పల్లిలోని వంద మంది లబ్ధిదారులకు ఒకేసారి యూనిట్లు మంజూరు చేయడంతో దళితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల చొప్పున వంద మందికి యూనిట్లు మంజూరు చేస్తున్నారు.
అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి పూజ..
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ శివారులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం 22 గుంటల భూమిని కేటాయించి, నిర్మాణం కోసం రూ. కోటి మంజూరు చేసింది. నియోజకవర్గ కేంద్రంలో దళితులు సమావేశాలు నిర్వహించుకోనేందుకు భవనం లేకపోవడంతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జహీరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో భూమితో పాటు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. మంత్రి హామీతో కలెక్టర్ హనుమంతరావు భవనం నిర్మాణం కోసం భూమి కేటాయించారు. అదేవిధంగా మున్సిపల్ పరిధిలోని రాచన్నపేటలో సీసీ రోడ్డు, వైకుంఠధామం ప్రారంభించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్ హామీ మేరకు జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 138 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాల్వల పనులు జోరుగా సాగుతున్నాయి.
మున్సిపల్లో అధికారులతో సమీక్ష సమావేశం
జహీరాబాద్ నియోజకవర్గంతో పాటు మున్సిపల్ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ మున్సిపల్కు రూ.50 కోట్లు మంజూరు చేయడంతో పట్టణంలో మంత్రి వివిధ వార్డులో పర్యటిస్తారు. సోమవారం రాత్రికి మహీంద్రా అండ్ మహీంద్రా అతిథి గృహంలో బస చేసి, మంగళవారం ఉదయం న్యాల్కల్ మండలంలోని సిద్ధివినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కోహీర్ మండలంలోని బిలాల్పూర్లో కొత్తగా నిర్మాణం చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.