సిద్దిపేటలో రేడియాలజీ హబ్ సిద్ధం
నేడు సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభం
నిరుపేదలకు అందుబాటులో ఆధునిక వైద్యం
ఉచితంగా ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ, 2డీ-ఏకో, మమోగ్రామ్ పరీక్షలు
సిద్దిపేట, మే 23 : నేడు ఏ దవాఖానకు వెళ్లినా వైద్యం కంటే వైద్య పరీక్షలకే ఖర్చు ఎక్కువ.. రోగ నిర్ధారణ పరీక్షల భారం పేదలకు శాపంగా మారుతున్నది. ఈ పరిస్థితిని గమనించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వైద్య పరీక్షలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని వైద్యపరీక్షలు పేదలకు ఉచితంగా అందేలా సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్కు దీటుగా డయాగ్నొస్టిక్, సీటీ స్కాన్ సేవలు అందిస్తున్నారు. దీనికి తోడు రెడియాలజీ హబ్ను మంగళవారం మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు.
అన్ని రకాల వైద్య సౌకర్యాలు
జిల్లాలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలందించాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్రావు సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, దవాఖానలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా 59 రకాలవ్యాధి నిర్ధ్దారణ పరీక్షలు జిల్లాలోని 33 పీహెచ్సీలు, దుబ్బాక, హుస్నాబాద్, నంగునూరు, చేర్యాల సీహెచ్సీలతో పాటు గజ్వేల్, సిద్దిపేట అర్బన్ హెల్త్ సెంటర్లలోచేస్తున్నారు. దీనికి తోడు ఈ పరీక్ష ఫలితాలను 24 గంటల్లో నేరుగా రోగి ఫోన్కు ఎస్ఎంస్ఎస్ రూపంలో పంపిస్తున్నారు. దీనికి అనుసంధానంగా రెడియాలజీ హబ్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని పరికరాలు సమకూర్చుకోవడంతో పాటు ఇన్స్టాలేషన్ కూడా పూర్తి చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో రెడియాలజీ సేవలు అందించేందుకు సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన ప్రారంభానికి సిద్ధమైనది.
ఉచితంగా ఐదు రకాల వైద్య పరీక్షలు
సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేస్తున్న రెడియాలజీ హబ్లో ఐదు రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత రక్తనాళాల్లో అడ్డంకులు, ఇతరత్రా సమస్యలు, హృదయ స్పందనలు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశ, గర్భిణుల్లో శిశువు ఆరోగ్య స్థితి, పెరుగుదల తెలుసుకోవడం, క్యాన్సర్ కణాలను నిర్ధ్దారించే మమోగ్రామ్ పరీక్ష చేయనున్నారు. సాధారణంగా ప్రైవేట్ దవాఖానల్లో మమోగ్రామ్ పరీక్షకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు ఖర్చవుతున్నది. ఎక్స్రేకు రూ.500, అల్ట్రాసౌండ్కు రూ.600, ఈసీజీకి రూ.300, 2డీ-ఏకో పరీక్షకు రూ.1500 వరకు ఖర్చు అవుతున్నది. పేదలకు ఆర్థికభారం తగ్గించేందుకు మంత్రి రెడియాలజీ హబ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉచిత సీటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరికి సుమారు రూ.5 వేల వరకు ఆర్థిక భారం తగ్గింది. కొవిడ్ రెండు దశల్లోనూ వ్యాధిసోకిన వారికి సీటీ స్కాన్ చేయించారు. కొవిడ్ నిర్ధ్దారణకు ఎక్కువగా సీటీ స్కాన్ పరీక్ష చేశారు. ఈ క్రమంలో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని గ్రహించి మంత్రి హరీశ్రావు సీటీస్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయించి ప్రభుత్వ దవాఖానకు వచ్చి రోగులకు ఉచితంగా అన్ని పరీక్షలు జరిగేలా రెడియాలజీ హబ్ను అందుబాటులోకి తెచ్చారు.