బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పాలన సాగిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు జాతి ఆస్తులు అమ్ముతూ, ప్రజలపై పన్నులు బాదుతూ ప్రజాకంటక పాలన చేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన విస్తృతంగా పర్యటించారు. రూ.156 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం కానున్నట్లు చెప్పారు. జహీరాబాద్ పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, డబుల్ బెడ్రూం ఇండ్లు, సమీకృత మార్కెట్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు తప్పక అందిస్తామన్నారు. మైనార్టీల సంక్షేమం, విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. ధరణి సమస్యలు అన్ని పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలులో సంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.
జహీరాబాద్, డిసెంబర్ 27: అన్నివర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గతంలో తాగు, సాగునీరు, కరెంట్ కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ఇప్పుడు ఆ సమస్యలు లేవన్నారు. గతంలో ఫరీదుద్దీన్ ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నోసార్లు నిధులు కావాలని కోరే వారన్నారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి లేక వాహనాలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోరగానే నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మాతాశిశు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
జహీరాబాద్లో మాతా శిశు సంక్షేమానికి 50పడకల దవాఖాన నిర్మాణానికి రూ. 11 కోట్ల్లతో పనులు చేపడుతున్నామని, వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. జహీరాబాద్లో సమీకృత కూరగాయల మార్కెట్ రూ. 10 కోట్లతో నిర్మాణం చేశామన్నారు. పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పూలు అమ్మకాలు చేసేందుకు షాప్ల నిర్మాణం చేశామన్నారు. సమీకృత మార్కెట్తో జహీరాబాద్కు కొత్త కళ వచ్చిందన్నారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. నారాయణఖేడ్కు సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు జహీరాబాద్ మున్సిపల్కు సైతం రూ. 50 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులతో ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేస్తామన్నారు. ప్రతి కుల సంఘానికి భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. వీటికోసం రూ. కోటి మంజూరు చేశామన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం కానుందని మంత్రి హరీశ్రావు తెలిపారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి…
జహీరాబాద్లో మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం షాదీఖాన, హజ్హౌస్ నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేసిందని, రూ. 10 కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్, సిద్దిపేటలో హజ్హౌస్లు ఉన్నాయని, త్వరలో జహీరాబాద్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. హౌజ్ కమిటీ ద్వారా చైర్మన్ సలీం రూ.కోటి మంజూరు చేయాలని మంత్రి కోరారు.
రూ. 18 కోట్లతో మైనార్టీ గురుకుల కళాశాల భవనం నిర్మాణం…
జహీరాబాద్ మండలం అల్గోల్లో రూ.18 కోట్లతో మైనార్టీ గురుకుల పాఠశాల భవన నిర్మాణం చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు పొందడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించారన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు ఉద్యోగాలు సాధించాలన్నారు. హైదరాబాద్లో తల్లిదండ్రులు లేని ఒక విద్యార్థి ఎంబీబీఎస్లో సీటు సాధించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇంగ్లషు మీడియంలో బోధన చేస్తున్నారన్నారు. పదో తరగతిలో వంతశాతం ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ శరత్, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో 16 మైనార్టీ గురుకుల పాఠశాలల ఏర్పాటు చేశామన్నారు.
జహీరాబాద్ పట్టణంలోని హమాలీ కాలనీ, గడ్డి హరిజన వాడలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి రోగులకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. జహీరాబాద్లో రూ. 10 కోట్ల్లతో ఏర్పాటు చేసిన సమీకృత కూరగాయల మార్కెట్తో కొత్తశోభ వచ్చిందన్నారు. ఈ పందర్భంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో మంత్రి హరీశ్రావు కూరగాయలు కొనుగోలు చేసి, వ్యాపారికి డబ్బులు చెల్లించారు. మార్కెట్లో అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేశామన్నారు.
విద్యార్థులకు రూ. 10 నగదు బహుమతి అందజేత…
జహీరాబాద్ మండలంలోని హోతి(కే) కేజీబీవీ పాఠశాలలో కళాశాల భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి హరీశ్రావుకు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు నచ్చి మంత్రి వారికి రూ. 10 నగదు బహుమతి అందజేశారు. హోతి(కే) బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు శ్రీలంక, నేపాల్ దేశంలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక కావడంతో ఖర్చుల కోసం రూ. 8 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు.
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు…
అర్హత ఉన్న ప్రతి పేదవారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని రహ్మత్నగర్లో 312 మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశామన్నారు. జహీరాబాద్ పట్టణ శివారులో 700 ఇండ్లు నిర్మాణం చేస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. పేదలు ఎవరూ ఆందోళన చేయవద్దన్నారు. రహ్మత్నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ప్రభుత్వ రేషన్ షాపు, అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పేదలు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఉన్న వారికి ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున సాయం చేయనున్నదని, నియోజకవర్గనికి 1000 ఇండ్లు తొలి విడతగా మంజూరు చేస్తున్నామని మంత్రి హరీశ్రావు చెప్పారు.
ఎత్తిపోతలతో సాగునీరందిస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గా సంక్షేమానికి కృషిచేస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు చేపడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం నీటిని సింగూరు ప్రాజెక్టులో నింపి సాగు నీరు అందిస్తామన్నారు.
– బీబీ పాటిల్, ఎంపీ జహీరాబాద్
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిపించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు వేగిరం చేసినట్లు తెలిపారు. పథకాలు, కార్యక్రమాల అమలులో సంగారెడ్డి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండడం సంతోషంగా ఉందని, మంత్రి హరీశ్రావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించడం మరిచిపోలేని విషయమన్నారు.
–శరత్, సంగారెడ్డి కలెక్టర్
జహీరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్లో నూతనోత్సాహం
సంగరెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల్లో మంగళవారం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పర్యటన విజయవంమైంది. దీంతో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ క్యాడర్లో నూతనోత్సాహం నెలకొంది. కోహీర్ మండలం దిగ్వాల్లో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్త భవనాన్ని ప్రారంభించారు. దిగ్వాల్లో రూ. 5.54 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో రూ. 71.28 కోట్లతో 54 పీఆర్ రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. రూ. 25.30 కోట్లతో ఆర్అండ్బీ 10 రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. కోటి రూపాయలతో జహీరాబాద్లో మినీ హజ్హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 10 కోట్లతో నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు.
రూ. కోటితో షాదీఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 1.54 కోట్లతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. జహీరాబాద్లో గడ్డి హరిజన్ వాడలో రూ.18 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన ప్రారంభించారు. జహీరాబాద్లోని రహ్మత్ నగర్లో రూ. 18 కోట్లతో నిర్మించిన 312 డబుల్ బెడ్ రూం ఇండ్లు పేదలకు పంపిణీ చేశారు. న్యాల్కల్ మండలం సిద్ధివినాయక దేవాలయంలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అల్గోల్ లో రూ. 18 కోట్లతో నిర్మించిర మైనార్టీ గురుకుల కళాశాల భవనాన్ని ప్రారంభించారు. రూ. 2.05 కోట్లతో ఝరాసంగంలో నిర్మించిన కేజీబీవీ పాఠశాలలో కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఝరాసంగం మండలం బిడెకన్న గ్రామంలో ధరణి పోర్టల్లో సమస్యలు పరిష్కరించారు.
ధరణి సమస్యలు లేని గ్రామంగా ప్రకటించారు. కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ డాక్టర్ శరత్, ఆడిషనల్ కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి, మైనార్టీ గురుకుల పాఠశాలల కార్యదర్శి షఫియాల్లా ఖాన్, మైనార్టీ సంక్షేమ అధికారి నాగేశ్, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటి చైర్మన్ పెంటారెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీదు, బీఆర్ఎస్ నాయకులు విజయ్మోహన్రెడ్డి, న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్న బాస్కర్, న్యాల్కల్ ఎంపీపీ అంజమ్మ, ఎంజీ. రాములు, సయ్యద్ మోహినొద్దీన్, రాములునేత, నామ రవికిరణ్, మోతిరాం, దేశెట్టి, అనంత నవీన్కుమార్, ఇజ్రాయిల్ బాబీతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కుల సంఘల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి: నీ పేరేంటి ..
విద్యార్థిని: నా పేరు కవ్వ..
మంత్రి : ఏ తరగతి చదువుతున్నావు
విద్యార్థిని: 7వ తరగతి చదువుతున్న సారు
మంత్రి: రోజూ ఏం భోజనం పెడుతున్నారు..
విద్యార్థిని: అన్నం, పప్పు పెడుతున్నారు సారు
మంత్రి : 8X9 ఎంత?
విద్యార్థిని: విద్యార్థిని నుంచి సమాధానం రాలేదు..
మంత్రి : 6X6 ఎంత?
విద్యార్థిని: విద్యార్థిని నుంచి సమాధానం రాలేదు..
మంత్రి : మీ లెక్కల టీచర్ ఎవరు. విద్యాబోధన సరిగా చేయడం లేదా?
మంత్రి : మరో విద్యార్థిని ప్రశ్నించినా సమాధానం రాలేదు. దీంతో టీచర్లు విద్యార్థినులకు మంచి బోధన చేయాలని మంత్రి సూచించారు.