సిద్దిపేట, నవంబర్ 9: “సిద్దిపేట ప్రజలే ప్రచారకులు, జిల్లా కేంద్రానికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకుందాం” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని మెహిన్పురా వేంకటేశ్వరాలయంలో నామినేషన్ పత్రాలకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఇక్బాల్ మినార్ వద్ద గల ఈద్గా, సిద్దిపేట సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సిద్దిపేట రిటర్నింగ్ కార్యాలయంలో అధికారి రమేశ్బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… సిద్దిపేట ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షకులు.. అభివృద్ధిని కోరుకునే వారన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుం టూ అండగా ఉన్నామన్నారు. ప్రజలే బంధువులుగా.. కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
సిద్దిపేట అంటే ప్రతిష్ట, ఒక ప్రత్యేకత ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. మన సిద్దిపేట అంటే గౌరవం ఉందని, దాన్ని నిలుపుకుందామన్నారు. భగవంతుడి ఆశీస్సులు సిద్దిపేట ప్రజల దీవెనలతో మంచి మెజార్టీతో గెలుస్తామనే సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు . గత ఐదేండ్లుగా రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నామని చెప్పారు. ఐదేండ్లు అనే పరీక్ష రాశా.. ఎన్ని మార్కులు వేస్తారో మీరే వేయండి.ఎందుకంటే నిత్యం దేవుడు ఇచ్చిన శక్తితో సిద్దిపేట ప్రజల కోసం పనిచేశానన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ర్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చామన్నారు. ఒకనాడు తెలంగాణ అంటే కురువు,కటకాలు తెలంగాణ అంటే వలసలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలిచా వులు ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు.
ప్రైవేట్రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆహ్వానించి 24లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. ఐటీ రంగంలో ఆరు లక్షల ఉద్యోగాల కల్పన చేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే లక్షా 80వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తుచేశారు. ’తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది” అన్నంత గొప్పగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు.. పక్క రాష్ర్టాల నుంచి ఇక్కడికి వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఐదు గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటికే రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం ప్రజలకు సీఎం కేసీఆర్ శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మీద నోరు పారేసుకుంటున్నారని, తండ్రి వయస్సు ఉన్న వ్యక్తి మీద సోషల్ మీడియాలో కొందిమంది ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రం అద్భుతమమైన ప్రగతి సాధించిందన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో, తెలంగాణ సాధించిన కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉండడం మంచిదన్నారు. తెలంగాణ పల్లెల్లో గుంటభూమి ఎండకుండా పంటలు పండుతున్నాయన్నారు. తాగునీరు, ఆడపిల్ల పెండ్లికి కల్యాణలక్ష్మి, బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్టు అందిస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని మంత్రి హరీశ్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ రూ.200 పింఛన్ను రూ.2000 చేశారని మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల పల్లె వరకు స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. చెరువులకు మరమ్మతులు చేసి చెక్డ్యామ్లను కట్టించారన్నారు. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టును కట్టి రెండు పంటలకు నీరు అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నాయకులను నమ్మి ఓట్లు వేస్తే మోసపోయి పదేండ్లు వెనక్కి వెళ్తామన్నారు. కాంగ్రెస్ పాలించే రాష్ర్టాల్లో చూస్తే రూ.600 పింఛన్ లేదన్నారు. రేపు తెలంగాణలో చేస్తారని నమ్మతే మనం మళ్లీ మోసపోయే అవకాశం ఉందన్నారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని ఇచ్చి సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు నిలబెట్టిన ఘనత సిద్దిపేట ప్రజలదన్నారు. ఈఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ అందించి గౌరవాన్ని కాపాడుకుందామన్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, సీనియర్ నాయకులు బాలకిషన్రావు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పాల సాయిరామ్, సంపత్రెడ్డి, ఎంపీపీలు బాలకృష్ణ, శ్రీదేవీచందర్రావు, మచ్చ వేణుగోపాల్రెడ్డి, మెహన్లాల్, కాముని శ్రీనివాస్, దువ్వల మల్లయ్య, శ్రీహరి గౌడ్,మైనార్టీ నాయకులు మోహిజ్, బాబుజాని, మజీర్ఖాన్, వహీద్ఖాన్, ఆర్టీఏ మెంబర్ ఇర్షద్ హుస్సేన్, వెంకటేశం ఉన్నారు.