నారాయణఖేడ్ రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే, ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటు, గంజాయి, కేసులు, వలసలకు నిలయంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైదారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. నారాయణఖేడ్, తడ్కల్, కంగ్టిలో జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్కుమార్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి పర్యటించి, వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దివ్యాంగులకు పింఛన్ పత్రాలు, పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ఖేడ్ పట్టణంలో 150 పడకల దవాఖానతో పాటు ప్రతి మండలంలో దవాఖాన నిర్మించామని, త్వరలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ పండించిన పంటలను కర్ణాటకలో అమ్ముకునేవారని, ప్రస్తుతం అక్కడ పండిన పంటలను ఇక్కడికి తెచ్చి విక్రయించుకుంటున్నారని గుర్తుచేశారు. త్వరలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించి ప్రతి ఎకరం పారిస్తామన్నారు.
– నారాయణఖేడ్/కంగ్టి, సెప్టెంబర్ 19
నారాయణఖేడ్, సెప్టెంబర్ 19: ఒకప్పుడు వెనుకబాటు, గంజాయి కేసులు, వలసలకు నిలయంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో పర్యటించి, పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు పనులు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, చరిత్రను మార్చారని అన్నారు. చెరువులు, చెక్డ్యామ్లను నిర్మించుకోవడంతోపాటు మార్కెట్యార్డు నిర్మించి, రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ పండిన పంటలు కర్ణాటకలో అమ్మేవారని, ఇప్పుడు కర్ణాటకలో పండిన పంటలు ఇక్కడికి తెచ్చి అమ్ముకుంటున్నారని, అంటే తమ ప్రభుత్వ పని తీరుకు ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. గతంలో పదిహేను రోజులకు ఒకసారి తాగు నీరు సరఫరా చేస్తే, ఇప్పుడు ప్రతి ఇంటికీ నల్లాలతో రోజూ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.
నియోజకవర్గానికి సరిహద్దున ఉన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసన్నారు. తమ ప్రభుత్వం వృద్ధులకు రూ.2016 పింఛన్ ఇస్తుండగా కర్ణాటకలో రూ.600 ఇస్తున్నారని, దివ్యాంగుల పింఛన్ అక్కడ రూ.1000 కాగా, కేసీఆర్ ప్రభుత్వం రూ.4016 ఇస్తున్నదన్నారు. ఇక్కడ 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంటే.. అక్కడ ప్రస్తుతం ఆరు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. ఓట్ల కోసం కర్ణాటకలో ప్రకటించిన ఆరు పథకాలను తెలంగాణలోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు కర్ణాటకలో అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ‘కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు’ కాంగ్రెస్ వైఖరి ఉన్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పోతున్నారన్నారు.
త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నారాయణఖేడ్కు తరలించి ప్రతి ఎకరా పారిస్తామన్నారు. స్థానికంగా 150 పడకల దవాఖానతోపాటు ప్రతి మండలంలో దవాఖానలు అభివృద్ధి చేశామన్నారు. త్వరలో స్థానిక ఏరియా దవాఖానలో టీడయాగ్నాస్టిక్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, రెండు దఫాల్లో 71 శాతం ఫిట్మెంట్ ఇచ్చి కడుపునిండా వేతనాలు ఇస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోరిన మేరకు అభివృద్ధి పనుల కోసం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా త్వరలో మరో పీఆర్సీని ప్రకటిస్తామన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక మైనార్టీ బంధు, గృహలక్ష్మి ఎంపికలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలు సేకరించి అర్హులైన వారిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నామన్నారు. ఆయా వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రుబీనా బేగం నజీబ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి సుడిగాలి పర్యటన
నియోజకర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంత్రి హరీశ్రావు సుడిగాలి పర్యటన చేశారు. తడ్కల్ను నూతన మండలంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. తడ్కల్లో రూ.20 లక్షలతో నిర్మించనున్న మైనార్టీ భవన్కు శంకుస్థాపన, కంగ్టిలో రూ.18.75 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు డబుల్ లేన్ రోడ్డు, రూ.15 కోట్లతో నారాయణఖేడ్-మాసాన్పల్లి డబుల్ లేన్ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఖేడ్లో రూ.50 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనం, రూ.1.50 కోట్లతో నిర్మించిన రోడ్డు డివైడ ర్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం, రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, రూ.22 లక్షలతో గజేంద్రభారతి ఆశ్రమ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. హెచ్ఆర్ ఫంక్షన్ హాల్ లో దివ్యాంగులకు పింఛన్ పెంపు పత్రాలు, నిరుపేదలకు ఇండ్ల స్థలాల పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు, మైనార్టీ బంధు మంజూరు పత్రాలు అందజేశారు. రెహమాన్ ఫంక్షన్హాల్లో పీఆర్టీయూ, టీఎస్యూటీఎఫ్, ముదిరాజ్, రంగరాజ్, శాలివాహన, స్వర్ణకార సంఘ ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తూ, పత్రాలు అందజేశారు. ఖేడ్ మండలంలో రూ.38 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ప్రభుత్వానికి అండగా ఉండాలి
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరవేసిందని, సంక్షేమ ఫలాలు పొందిన ప్రతిఒక్కరూ కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నా రు. గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని మరోసారి దీవించాలని కోరారు.
హరీశ్రావు సహకారంతో అభివృద్ధి పరుగులు
సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్రావు సహకారంతో ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. తమ నియోజకవర్గాన్ని మంత్రి హరీశ్రావు దత్తత తీసుకున్న తర్వాత తాను ఏది అడిగినా కాదనకుండా అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. మంత్రి సహకారంతో నాలుగు కొత్త మండలాలు చేసుకున్నామన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మరో రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల మేలు మరువబోమన్నారు.