సిద్దిపేట, మార్చి 26 : రోగులతో వైద్యా సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. జిల్లా కేంద్రం సిద్దిపేట సర్వజన దవాఖానలో ఆదివారం రక్తనమూనాల సేకరణ కేంద్రం, దోబీఘాట్ను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రోగులతో దవాఖాన సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు మరోసారి తన దృష్టికి రావొద్దని స్టాఫ్ నర్సులను ఆదేశించారు. వార్డులోని మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, దవాఖానను సందర్శించి రోగి బంధువులతో ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని, టాయిలెట్లు పరిశుభ్రంగా లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు లోగా వెయ్యి పడకల దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలని వైద్య ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టరును ఆదేశించారు.
దవాఖానలో మహిళలతో మంత్రి మాటామంతీ
దవాఖానకు వచ్చిన మహిళలతో మంత్రి మాట్లాడారు. రోజు అన్నం పెట్టి, ఒకరోజు పెట్టకపోతే ఎలా.. ఏ ఊరు అమ్మా గుర్రాలగొంది అంటూ మహిళలను పలకరించారు. మరో మహిళతో మీది ఏ ఊరు అని అడుగగా, మిరుదొడ్డి అనగానే.. ఎవరు ఉన్నారు.. దవాఖానలో కోడలు ఉందని చెప్పింది. డెలివరీ అయ్యిందా.. ఎప్పుడు వచ్చిండ్రు. నాలుగు రోజులైందని, మనమడు పుట్టిండా అని సంతోషంగా చెప్పగానే అదృష్టవంతురాలువు అంటూ మంత్రి చిరునవ్వులు చిందిస్తూ ముందుకు కదిలారు. మరో మహిళతో పెరుగు, మజ్జిగా పోస్తున్నారా అంటూ అడిగారు. రెండు రోజుల నుంచి పోయలేదని మహిళ సమాధానం చెప్పింది. సాయంత్రం 4 గంటలకు గుడ్డు, పల్లీపట్టీలు ఇస్తున్నారని మహిళ అనగానే రోజుకు ఎన్ని గుడ్లు ఇస్తున్నారని మంత్రి అడిగారు. రెండు కోడిగుడ్లు, 2 పల్లీపట్టీలు, అరటి పండు ఇస్తున్నారని మహిళ చెప్పింది. మరో మహిళ వాష్రూమ్లో నీళ్లు సరిగ్గా రావడం లేదని తెలుపగా, వాష్రూమ్లు శుభ్రంగా లేవని చెప్పింది. వెంటనే శుభ్రం చేయాలని మంత్రి ఆదేశించారు. మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలన్నారు. మరో వ్యక్తి తొంటి విరిగిందని, దవాఖానలో అడ్మిన్ అయ్యానని మంత్రికి చెప్పగా, ఆపరేషన్ చేయాలని అడగగా, వెంటనే వైద్యం ప్రారంభించాలని డాక్టర్లకు సూచించారు. కారిడార్లో పెయింటింగ్ వేయించాలన్నారు.
జీజీహెచ్ సుందరీకరణ పనులు పూర్తి చేయాలి
జీజీహెచ్ పెండింగ్ సుందరీకరణ పనులకు రూ.4.17 కోట్లు మంజూరైనట్లు, ప్రభుత్వ జనరల్ దవాఖాన అనుబంధ మెడికల్ కళాశాలలోని మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. దవాఖాన ఆవరణలో సుందరీకరణ, మరమ్మతులు, మార్చురీ మరమ్మతులు, అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ నిర్మాణాలు, విద్యుత్ మరమ్మతు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
సిద్దిపేట జీజీహెచ్కు మదర్ మిల్క్ బ్యాంకు
సిద్దిపేట జీజీహెచ్కు మదర్ మిల్క్ బ్యాంకు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు కొందరికి పడవని, దీంతో మరో తల్లిపాలు ఇచ్చేందుకు మిల్క్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బిడ్డకు తల్లిపాలు ఆరోగ్యానికి మంచిదని, తల్లిపాలు ఇవ్వడం రోగ నిరోధక శక్తి పెరుగుతున్నదన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించాలని కోరారు.
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఐదు పీజీ సీట్ల పెంపు
సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మరో ఐదు పీజీ సీట్లు పెరిగినట్లు మంత్రి చెప్పారు. మెడికల్ కళాశాలలో ప్రస్తు తం 57 సీట్లు ఉన్నాయని, దీంతో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్కు మరోఐదు సీట్లు పెరిగినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రెడ్డి ఫంక్షన్ హాల్ను ప్రారంభించిన మంత్రి
సిద్దిపేట, మార్చి 26 : తెలంగాణలో మెట్టమొదటిగా రెడ్డి సంక్షేమ సంఘం ఏసీ ఫంక్షన్ హాల్ను సిద్దిపేటలో నిర్మించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆదివారం పట్టణంలోప్రశాంత్నగర్లో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం ఏసీ ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి ప్రారంభించారు. ప్రశాంత్నగర్ రెడ్డి సంఘం నిర్మాణానికి రూ.72లక్షలు సహా యం చేశామన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్రెడ్డితో పాటు రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.