ఆకలితో ఉన్న వారందరికీ ఉచితంగా భోజనాలు అందించడం చాలా గొప్ప విషయమని, హరే కృష్ణ చేస్తున్న సేవలు అద్భుతమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని అక్షయపాత్ర మెగా కిచెన్ ఆవరణలో కృష్ణ మందిరం, సాంస్కృతిక కేంద్ర నిర్మాణ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. ట్రస్ట్కు తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. అంతకుముందు పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాలను పరిశీలించి పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. బోధన, వ్యాక్సినేషన్, ఇతర సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
పటాన్చెరు/ సంగారెడ్డి అర్బన్, జూలై 31: హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు మహాద్భుతమని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రతిరోజు 65వేల మందికి ఉచితంగా భోజనాలు అందిస్తూ ఆకలి తీరుస్తున్నదన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని అక్షయపాత్ర మెగా కిచెన్ ఆవరణలో ఆదివారం కృష్ణ మందిరం, సాంస్కృతిక కేంద్ర నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులు ఎలాంటి తారతమ్యం లేకుండా ఆకలితో అలమటిస్తున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా భోజనాలు అందించండం గొప్ప విషయమన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆపదలో ఉన్నవారు, దవాఖానల్లో సహాయకులకు, పట్టణాల్లో వలస కార్మికులు ఇలా లక్షల మందికి భోజనాలు అందిస్తున్న ఘనత ఈ ఫౌండేషన్ వారిదని ప్రశంసించారు. ఈ ఫౌండేషన్ చేసే సేవలో తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి హామీనిచ్చారు.
అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హరే కృష్ణ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌరదాస్ మాట్లాడుతూ కంది మండల కేంద్రంలో నిర్మించిన అక్షయపాత్ర మెగా కిచెన్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచిందన్నారు. హరేకృష్ణ కల్చరర్ సెంటర్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని అందించిన దాత విమలేశ్వర్రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ కేంద్రంలో నిత్యం హరే కృష్ణ జపం చేయడంతో ఈ ప్రాంతం పవిత్రంగా మారుతున్నదన్నారు. తమకు అన్ని విధాల మద్దతునిస్తూ ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత దాసుల సమక్షంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం, పూర్ణాహుతి, భక్తుల హరేకృష్ణ మహామంత్ర సంకీర్తనలు వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కంది సర్పంచ్ విమలావీరేశం, ఎంపీపీ సరళాపుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, హరేకృష్ణ ఫౌండేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.