పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పటాన్చెరు డివిజన్లో రూ.3.26కోట్లతో ఫ్రీడమ్ పార్కు, రూ.1.50కోట్లతో డీసీసీబీ భవనం, రూ.2.40కోట్లతో ఏర్పాటు చేసిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.1.50కోట్లతో నిర్మించనున్న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రూ.75కోట్లతో రోడ్డు విస్తరణ చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ఆర్డీవో, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మంజూరు చేశామని, మార్కెట్ యార్డు తెచ్చుకున్నామని తెలిపారు. రాయసముద్రం చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంజూరు చేశామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని జోస్యం చెప్పారు.
– రామచంద్రాపురం /పటాన్చెరు,జూలై10
రామచంద్రాపురం/పటాన్చెరు, జూలై 10: అభివృద్ధి విషయంలో పటాన్చెరు నియోజకవర్గం దూసుకుపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ధైర్యంగా ప్రజలకు సేవలు అందించిన సఫాయ్ అన్నను, ప్రాణం కాపాడే డాక్టర్ను, పోలీస్ను సమానంగా గౌరవించే విధంగా పటాన్చెరులో సఫాయ్ అన్నకు సలాం అంటూ ముగ్గురు విగ్రహాలను ఏర్పాటు చేసి కష్టకాలంలో వారు చేసిన సేవలను గుర్తించుకునే విధంగా చేయడం చాలా అద్భుతమని మంత్రి హరీశ్రావు అన్నారు. తాగుబోతులకు అడ్డాగా మారిన స్థలంలో అద్భుతంగా గాంధీ పార్కుని, జిమ్ను ఏర్పాటు చేసి..ఇప్పుడు ఆ పక్కనే ఫ్రీడమ్ పార్కుని ఏర్పాటు చేసి అందులో 200ఫీట్ల జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని మంత్రి తెలిపారు. సోమవారం పటాన్చెరు డివిజన్లో రూ.3.26కోట్లతో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కు, రూ.1.50కోట్లతో ఏర్పాటు చేసిన డీసీసీబీ భవనం, రూ.2.40కోట్లతో ఆర్అండ్బీ గెస్ట్హౌస్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించడంతో పాటు రూ.1.50కోట్లతో నిర్మించనున్న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఫ్రీడమ్ పార్కుని ప్రారంభించిన అనంతరం మంత్రి 200ఫీట్ల జాతీయజెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం రోజురోజుకూ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకుసాగుతుందని తెలిపారు. డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా బ్రాంచ్ ఎన్నో కొత్తకొత్త బ్రాంచ్లతో వ్యాపారాన్ని, అభివృద్ధి చేసుకుంటూ ముందకెళ్తుందన్నారు. పటాన్చెరులో డీసీసీబీకి రూ.1.50కోట్లతో అధునాతన వసతులతో పక్కా భవనాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను గుర్తు చేసుకున్నప్పుడు ముందుగా మనం గతంలో ఆర్అండ్బీ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావుని గుర్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరులో పాడుబడిన బూత్బంగ్లాగా ఉన్న భవనాన్ని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ చేయాలని కోరడంతో ఎమ్మెల్యేను వెంటబెట్టుకొని వెళ్లి తుమ్మల నాగేశ్వర్రావుని కోరడంతో నాలుగు సూట్లతో గెస్ట్హౌస్ని మంజూరు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా నాలుగు అంతస్తులతో కూడిన వార్డు కార్యాలయం, మహిళా భవనం ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్ పటాన్చెరుకు వచ్చినప్పుడు వరాలజల్లు కురిపించి వెళ్లారని, దాదాపుగా రూ.128కోట్లు పటాన్చెరు అభివృద్ధికి సీఎం కేటాయించారని, ఆ నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తామన్నారు.
పటాన్చెరులో ఆర్డీవో, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మంజూరు చేశారన్నారు. అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలతోపాటు రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడి ప్రజలు కొన్నేండ్లుగా కలుషిత నీటితో ఇబ్బంది పడేవారని, వారి సమస్యను తీర్చేందుకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రూ.75కోట్లతో రోడ్డు విస్తరణ చేసి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చామన్నారు. పటాన్చెరుకు మార్కెట్ యార్డ్ని తెచ్చుకున్నామని, త్వరలో రాయసముద్రం చెరువుని అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఈ ప్రాంతంలో ఐటీ సేవలను విస్తరిస్తామన్నారు. గతంలో పొల్యూషన్ ఇండస్ట్రీస్ వస్తే, నేడు ఎల్ఈడీ పార్కు, ఐటీ సర్వీస్ ఇలా నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ తెచ్చామన్నారు. మెడికల్ డివైస్ పార్కుతో వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయని తెలిపారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని ఆరేండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్ది.. బీఆర్ఎస్దేనని అన్నారు. పటాన్చెరులో 2500 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంజూరు చేయడంతోపాటు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఎమ్మెల్యే కోరినట్లు ఒకొక్క మున్సిపాలిటీకి రూ.25 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, ఆ నిధులు విడుదల చేయిస్తామన్నారు. భారతీనగర్ డివిజన్లోని రిటైర్డ్ భెల్ ఉద్యోగులకు ఆసరా పింఛన్, రేషన్ కార్డులను ఇప్పిస్తామన్నారు. తెల్లాపూర్లో యాదవ,కురుమల కోరిక మేరకు బీరప్పల గుడికి రూ.20కోట్ల భూమిని అందించి ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేశామని మంత్రి చెప్పారు. ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు మళ్లీ దీవిస్తే పటాన్చెరుకు మెట్రో రైలు తీసుకువస్తామన్నారు. కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ప్రభుత్వాన్ని గెలుపించుకోవాలన్నారు.
ప్రతిపక్షాలకు మిగిలేది పరాభవమే
ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు రాగానే అధ్యక్షులను మారుస్తున్నారు. అధ్యక్షులను మార్చినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రతిపక్షాలకు మిగిలేది పరాభవమేనని రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వామేనని మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులను తీసుకొచ్చి జిమ్మిక్కులు చేసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని, ప్రజలు విజ్ఞులని తమకు జరిగిన మేలుని మర్చిపోరని తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని, రూ.20వేల కోట్ల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే..రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టారని అన్నారు. మనం లడ్డూ అడిగితే పిప్పర్మెంట్ ఇచ్చినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. కండ్ల ముందు అభివృద్ధి..కంటిముందు అభ్యర్థిని గమనించి ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్, మున్సిపాల్ చైర్మన్లు లలితాసోమిరెడ్డి, పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్, సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, మాజీఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, కుమార్గౌడ్, సుధాకర్రెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, దేవానంద్, ఏఎంసీ చైర్మన్ విజయ్కుమార్, కౌన్సిలర్లు రవీందర్రెడ్డి, చంద్రారెడ్డి, బాబ్జీ, లచ్చిరాం, నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, గూడెం విష్ణువర్ధన్రెడ్డి, గూడెం విక్రమ్రెడ్డి, అఫ్జల్, యాదగిరి, శ్రీశైలం, నర్రా భిక్షపతి, శ్రీధర్చారి, దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, అంజయ్య, పరమేశం, మన్నేరాజు, రవి, కుమార్గౌడ్, మోహన్రెడ్డి, లక్ష్మారెడ్డి, కొమురయ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చొరవతోనే పటాన్చెరు నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది. పటాన్చెరులో రూ.350 కోట్లతో సూపల్ స్పెషాలిటీ దవాఖానకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 15రోజులు తిరగకముందే పటాన్చెరులో రూ.8.66కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నాం. అడగ్గానే వరాలిచ్చే దేవుడిలా సీఎం కేసీఆర్ రూ.128కోట్లను పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు.
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు..
తనపై అభిమానంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా బరువైన బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు. నా కోరిక వేరేది ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ సూచనల మేరకు నాకు అప్పగించిన బాధ్యతలను పాటిస్తా. ఆర్సీపురంలో ఉన్న గెస్ట్హౌస్ని జీహెచ్ఎంసీకి అప్పగించాలని కోరాను. స్పందించిన హరీశ్రావు కలెక్టర్ శరత్కు ఆదేశాలు జారీచేయడంతో జీహెచ్ఎంసీకి అప్పగిస్తామని తెలిపారు.
– భూపాల్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్