‘మధుర కవి’గా పేరు పొందిన మడిపడగ బలరామాచార్యులు కవిగానే గాక చిత్రకారునిగా, శిల్పిగా, గాయకుడిగా, గ్రంథ ప్రచురణ సంస్థ నిర్వాహకునిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా బహుముఖీనమైన సేవలందించిన వ్యక్తి. ఆయనకు శతజయంతి నివాళిగా ఈ చిరు వ్యాసం..
మడిపడగ బలరామాచార్యులు 1926 ఆగస్టు 11వ తేదీన సికింద్రాబాద్లోని జనరల్ బజార్ ప్రాంతంలో జన్మించారు. మడిపడగ లక్ష్మమ్మ, రాజయ్య అతని తల్లిదండ్రులు. వీరి పూర్వీకుల గ్రామం మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని మడిపడగ. ఊరి పేరే ఇంటి పేరుగా కొనసాగింది. వంశపారంపర్యంగా వస్తున్న తమ కులవృత్తి అయిన స్వర్ణకార వృత్తినే ఆయన జీవనోపాధిగా స్వీకరించారు.
కలాసిగూడ ధన్బజార్ ప్రాంతంలోని ఉన్నత పాఠశాలలో నాల్గవ ఫారం వరకే బలరామాచార్యులు చదివారు. సికింద్రాబాద్లో తన తండ్రి నడిపే బంగారం దుకాణంలో పని నేర్చుకొని, అందమైన ఆభరణాలు తయారుచేసేవారు.
ఆ దశలోనే కుంచె పట్టి రంగుల బొమ్మలు వేసే చిత్రకళను, ఉలితో శిలలను చెక్కి, శిల్పాలుగా మలిచే శిల్పకళను కరతలామలకం చేసుకున్నారు. ఈ అభిరుచి, అభినివేశం క్రమంగా అక్షరాలను చెక్కి, కవిత్వంగా మలిచే కవితా రచన వైపు దారితీసింది. అందుకు కావలసిన ముడిసరుకు కోసం, ఆయన తెలుగు, ఉర్దూ, పార్శీ, ఆంగ్ల కవిత్వాలను లోతుగా అధ్యయనం చేశారు. వాటిల్లోని గేయకవితా రీతులను ఆకళింపు చేసుకున్నారు.
మడిపడగ బలరామాచార్య-దుబ్బాక గోపాలాచార్య కలిసి జంటకవులుగా, వారి ఇంటి పేర్లలోని మొదటి అక్షరాలు ‘మదు’గా వారి పేర్లలోని మొదటి పదాలు కలిపి ‘రామగోపాల’ కలం పేర్లుతో అనేక కవితలు రాశారు. 1939లో సికిందరాబాద్ కేంద్ర ంగా వట్టికోట ఆళ్వారుస్వామి ప్రోత్సాహంతో, రాచమల్ల సత్యవతీ దేవి సంపాదకత్వంలో ‘తెలుగు పత్రిక’ వెలువడేది. ఈ పత్రికతోపాటు ఆళ్వారు స్థాపించిన ‘దేశోద్ధారక గ్రంథమాల’, ‘అణా గ్రంథమాల’ బలరామాచార్యులను బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి లబ్ధ్ద ప్రతిష్ఠులైన కవిపండితులు తాపీ ధర్మారావు, నిడదవోలు వెంకటరావు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, వానమామలై వరదాచార్యులు, దాశరథి సోదరులు, బిరుదురాజు రామరాజు, దివాకర్ల వేంకటావధాని, సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళోజీ, నటరాజ రామకృష్ణ, ఉత్పల సత్యనారాయణాచార్య మొదలైన వారి సాహచర్యం మడిపడగ బలరామాచార్య సాహిత్య ప్రస్థానానికి బలాన్ని కూర్చింది. వారి పుస్తకాలకు ముఖచిత్రాలు వేయడం వల్ల ఆయన వారికి ఎంతో దగ్గరయ్యారు. వట్టికోట ఆళ్వారుస్వామి, మడిపడగ తరచుగా కలుసుకుని సాహిత్య చర్చలు జరిపేవారు. దాశరథి, ఉర్దూ కవిత్వంలోని సౌందర్యాత్మకతను గురించి గంటల తరబడి ముచ్చటించుకునేవారు. కాళోజీ మడిపడగకు ఆప్తమిత్రుడు.
మడిపడగ బలరామాచార్యులు సుమారు 65 కావ్యాలు రచించగా, వాటిలో 25 వరకు అచ్చయినట్లు చెప్తారు. వీటిలో ‘ఉమర్ ఖయ్యాం అమరగీతాలు’ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన రాసిన ‘మురళీరవం’, ‘పాంచజన్యం’, ‘గుడిగంటలు’, ‘శ్రీశైలం’, బొమ్మల బాల గేయాలు’, దాశరథితో కలిసి రాసిన ‘ఖబర్దార్ చైనా’ వంటివి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ‘మేనకా విశ్వామిత్రం’, ‘శాకుంతలం’, ‘శతానందం’, ‘భ్రమర గీతాలు’, ‘గీతాంజలి’, ‘గోపికానందం’, ‘బ్రహ్మంగారి చరిత్ర’, ‘మాధవారాధనం’, ‘మధులహరి’, ‘కదంబ కాహళి’, ‘వాస్తు చంద్రిక’ వంటి పలు కావ్యాలను ఆయన రాశారు.
మడిపడగ రచనల్లో భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు చెప్పుకోదగ్గవి. ఆనాటి హెచ్ఎంవీ గ్రామ్ఫోన్ కంపెనీవారు ఆయన పాటలను రికార్డులుగా తీసుకొచ్చారు. వాటిలో ‘చిటపట చినుకులు’ అనే పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘సినిమా రాణి’, ‘శూర్పణఖ’ అనే సినిమాలకు పాటలు కూడా ఆయన రాశారు. 1969 నాటి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు కూడా రాశారని చెప్తారు. చిత్రకారునిగా మద్దిపడగ గీసిన చిత్రాల్లో రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, పొన్నచెట్టు నీడన రాధాకృష్ణులు జీవకళతో ఉట్టిపడుతూ చిత్రకారునిగా పేరు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు ఆనాడు అట్టబొమ్మలు వేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఆనాటి సంగీత, నాటక అకాడమీ వారి ‘నాట్యకళ’ పత్రికకు అర్థవంతమైన అక్షరాల కూర్పుతో శీర్షికను గీశారు. 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల లోగోను రూపొందించింది ఆయనే. వివిధ కోణాల్లో తన ప్రతిభను కనబరచిన మడిపడగ 1992 జూన్ 9వ తేదీన కన్నుమూశారు.
– (వ్యాసకర్త: పూర్వ రిజిస్ట్రార్, తెలుగు విశ్వవిద్యాలయం)
ఆచార్య టి. గౌరీశంకర్ 9440969130