ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష విజయవంతం
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమం
మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ శ్రేణులు హాజరు
తెలంగాణ ధాన్యం కొనాల్సిందేనని.. కేంద్ర సర్కారు దిగిరావాలని డిమాండ్
హస్తినలో గులాబీ జోష్
అడుగడుగునా తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర సర్కారుపై ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నది.ఈ కోవలో హస్తినలో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష విజయవంతమైంది. భారీగా గులాబీ దండు రాకతో ఢిల్లీ దద్దరిల్లింది. మన రైతులకు జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బీజేపీ సర్కారుపై గళమెత్తారు. మోదీ సర్కారు తీరును దేశ రాజధాని వేదికగా ఎండగట్టారు. రైతుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో మెతుకుసీమ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతుకు మద్దతుగా దీక్ష చేయడంతో హస్తిన దద్దరిల్లింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు, శ్రేణులు వెళ్లి నిరసన తెలిపారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు నేతృత్వంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, ఎఫ్డీసీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, రైతు సంఘాల నాయకులు ఢిల్లీ నిరసన దీక్షలో పాల్గొన్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం’.. బాగుపడదంటారు. రైతుల ఉసురుతీస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది సరిగ్గా సూటవుతుంది. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ సర్కారుకు నూకలు చెల్లే రోజులు దగ్గరపడుతున్నాయి. తెలంగాణ రైతులకు నూకలు అలవాటు చేయండి.. అని మాట్లాడిన కేంద్రంలోని బీజేపీ మంత్రులకు ఇక్కడి రైతులు నూకలు తినిపించడానికి సిద్ధమైండ్రు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో మార్పు రాకపోవడంతో సోమవారం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్షను చేపట్టింది. ఈ దీక్షలో సీఎం కేసీఆర్ పాల్లొన్నారు.
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు నేతృత్వంలో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాశ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు వేలేటి రోజాశర్మ (సిద్దిపేట), హేమలతాశేఖర్ గౌడ్ (మెదక్), మంజుశ్రీజైపాల్రెడ్డి (సంగారెడ్డి), ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి సిద్దిపేట, మెదక్ జిల్లాల అధ్యక్షులు వంగ నాగిరెడ్డి, సోములు, రైతుబంధు సమితి సభ్యులు, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్వీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, జిల్లా నాయకులు పండరి రవీందర్రావు, పలువురు ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు, రైతు సం ఘాల నాయకలు ఢిల్లీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును సీఎం కేసీఆర్ ఎండగట్టారు.
తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడే రైతులకు మంచి రోజులు వచ్చాయనుకుంటున్న తరుణంలో రైతులు కేంద్రం తీరుతో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు వలసలుగా ఉన్న జిల్లాలు నేడు వలసలు పూర్తిగా వాపస్ వచ్చి, ఉన్న ఊరిలోనే పంటలు పండించుకొని హాయిగా ఉందామనుకున్న రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ రాష్ట్ర నాయకుల తీరు అర్ధరహితంగా ఉందని రైతు సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సింది ఎఫ్సీఐ. ఆ సంస్థ ఎంత కొంటుందో చెబితే, ఆ మేరకు ఆయా రాష్ర్టాలు రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఇస్తుంది. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. ఇది తెల్వని మూర్ఖులుగా కేంద్రంలోని బీజేపీ నాయకులు, కేంద్ర మం త్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపింది. సోమవారం ఢిల్లీలో కూడా తన గళాన్ని వినిపించింది. కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. మరో ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతున్నది. కేంద్రం అవలంబిస్తున్న విధానాలను రైతులకు టీఆర్ఎస్ విడమరిచి తెలియజేస్తున్నది. గ్రామాలకు వచ్చే బీజేపీ నాయకులకు ఎక్కడికక్కడ నిలదీయడానికి రైతులు సిద్ధమవుతున్నారు.
ఢిల్లీ మహాధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు
కేంద్రానికి నూకలు చెల్లినట్లే!
తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం తప్పనిసరిగా కొనాల్సిందే. దేశమంతా ఒకే చట్టం ఉండాల్సిందే. పంజాబ్ వడ్లు కొంటరెట్ల! తెలంగాణ వడ్లు కొనరెట్ల! తెలంగాణలో యాసంగిలో నూకలు ఎట్లాగు ఎక్కువైతయి. తెలంగాణ ప్రభుత్వంపై కక్షతోనే వడ్లు కొనడానికి వంకలు పెడుతున్నరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి నూకలు చెల్లుతాయి.
–పేర్యాల రాజేశ్వర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్, కోహెడ
కేంద్ర ప్రభుత్వం వివక్ష వీడాలి
రైతులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్ష వీడాలి. రైతుల కోసం ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేపట్టిన ధర్నాకు రైతుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. మోదీ సర్కార్ ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరా టం చేస్తాం. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. అది చూసి ఓర్వలేక కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. రైతులతో చెలగాటం ఆడుతున్న బీజేపీకి రైతులు సరైన రీతిలో బుద్ధి చెబుతారు.
-సంజీవులు, రాణాపూర్, మనూరు మండలం
రైతుల కోసం ఎందాకైనా పోతాడు
రైతుల బాగు కోసం సీఎం కేసీఆర్ ఎందాకైనా పోతాడు. రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. కేంద్రం ధాన్యం కొనకుంటే ఊరుకోడు. రైతులందరం కేసీఆర్ వెంటే ఉంటాం. పండించిన వరి పంటను కొనమంటే మేమేమైపోవాలి. మేము మొండి పట్టుబట్టి తెలంగాణను సాధించుకున్న తెలంగాణ బిడ్డలం. మోదీ సర్కార్ మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తము. రైతులంతా ఏకం కాకముందే కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలి. ఢిల్లీలో రైతుదీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నాం.
–గుండె లింగం, రైతు, బ్రాహ్మణపల్లి, నర్సాపూర్
రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి
రైతు కుటుంబంలో పుట్టిన సీఎం కేసీఆర్ సార్కు రైతుల కష్టాలు తెలుసు. అందుకే రైతు సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నడు. రైతులను మోసం చేస్తున్న కేంద్రం వడ్లను కొనాలని గిప్పుడు మా లాంటి రైతుల అందరి పక్షాన ఢిల్లీలో రైతు ధర్నా చేస్తున్నాడు. ధర్నా తప్పకుండా విజయం సాధిస్తుంది. రైతుల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ సీఎం సార్కు ఉంటాయి. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతాం.
-పరిపాటి మోహన్రెడ్డి, రైతు, నస్కల్
రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది.
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రోడ్డెక్కే పరిస్థితికి దిగజార్చిన ఘనత కేంద్రం ప్రభుత్వానికే దక్కుతుంది. నూకలు తినాలంటూ తెలంగాణ సమాజాన్ని అవమానపరిచిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను వెంటనే బర్తరఫ్ చేయా లి. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే భేషరతుగా కొనుగోలు చేయాలి. అప్పటి వరకు పోరాటం ఆగదు.
-సురేందర్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్, తూప్రాన్
రైతులను కేంద్రం మోసం చేస్తున్నది..
వడ్లు కొనకుంట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. అందుకే సీఎం కేసీఆర్ సార్ ఢిల్లీల నిరనస దీక్ష చేపట్టిండు. తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడుతున్న సీఎం కేసీఆర్ సారుకు ఎప్పటికీ మా మద్దతు ఉంటది. యాసంగిలో పండిన వడ్లను కొనకపోతే బీజీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– చింతల రాజు, గుర్రాలగొంది, నారాయణరావుపేట
వరి పెట్టుమన్న బీజేపీ ఎందుకు కొనదు..
ప్రతి గింజా మేం కొట్టం.. వరి పెట్టండి.. అని బీజేపీ నాయకులు రైతులను రెచ్చ గొట్టి, వరి పెట్టుమని చెప్పిండ్రు.. ఇప్పు డు వడ్లు కొనకుండా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తున్నది. బీజే పీ ప్రభుత్వం బియ్యం కావాలని కొర్రీలు పెడుతున్నది. ఇప్పటికే విపరీ తంగా బాయిల్డ్ రైస్మిల్లులు నడుస్తున్న కాలంలో రా రైస్ ఇవ్వమని చెప్పుడు బీజేపీ విధానం సరికాదు. బాయిల్డ్ రైస్ను ఎగుమతి చేసే అవకాశమున్నా, బీజేపీ రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. వరి పెట్టుమని చెప్పి, ఇప్పుడు కొర్రీలు పెట్టడం రైతులను నష్టపరచడమే.
–ఆలేటి మాధవరెడ్డి, రైతుమిత్ర పరస్పర సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, హుస్నాబాద్
బీజేపీకి వచ్చిన కష్టమేంది
రైతుల ధాన్యాన్ని బీజేపీ ప్రభుత్వం కొనకపోతే పుట్టగతులుండవు. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనేందుకు కేంద్రానికి వచ్చిన కష్టనష్టం ఏముం ది? దేశంలో ఉన్న అందరి రైతులు పండించిన పంటలు కొనాలనే నిబంధన ఉన్నా, మమ్మల్ని కష్ట పెట్టడడం ఎందుకు? రైతుల బాధలు తెలిసే సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేస్తున్నడు.
– కర్రెడ్ల మాధవరెడ్డి, రైతు, ఆకునూరు, చేర్యాల
వడ్లను కొనకుంటే మీ సంగతి చూస్తాం
మేము పండించిన వడ్లను కొనకుంటే బీజేపీ ప్రభుత్వం సంగతిని రైతులదరం కలిసి చూసుకుంటాం. మాకు ఇక్కడే గీ దొడ్డు వడ్లే పండుతయి.. మమ్మల్ని సన్న వడ్లు పండియ్యాలంటే ఎట్లా? గిన్నేండ్ల కొలే లేనిది.. గిప్పుడూ మా రైతులను గోస పెట్టడం బీజేపీకి మంచిది గాదు. సీఎం కేసీఆర్ సార్ చెప్పినట్లుగా మా దొడ్డు వడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలే. లేందటే రైతుల ఉసురు తగిలి పోతారు.
– మొగుళ్ల సింగరాలు, రైతు, మిరుదొడ్డి
అణచివేత ధోరణిని ఎండగడతాం..
మన రైతులు పండించిన వడ్లు కేంద్రమే కొనాలి. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పిస్తాం.. బీజేపీ తెలంగాణ రైతులపై అవలంబిస్తున్న అణచివేత ధోరణిని ఊరురా ఎండగడతాం. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న శ్రమను మరింత ప్రచారం చేస్తాం.
– ఇర్రి రామకృష్ణారెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్, వర్గల్
బీజేపీ నీతిని బట్టబయలు చేస్తాం
మన రైతులు పండించిన వడ్లను బాజాప్తా కేంద్రమే కొనాలి. పంజాబ్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మరో న్యాయం. తెలంగాణకో న్యాయమా? ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీకి నూకలు చెల్లాయి. తెలంగాణపై బీజేపీ చేస్తున్న కుటిల నీతిని ప్రజల్లోకి వెళ్లి చెబు తాం. ఇందుకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తాం.
– దేవగనిక నాగరాజు, టీఆర్ఎస్ వర్గల్ మండలాధ్యక్షుడు
రైతు వ్యతిరేకి.. కేంద్రంలోని బీజేపీ..
కేంద్రంలో బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. జై జవాన్.. జై కిసాన్.. అంటూనే రైతులను అణచివేస్తున్నది. వ్యవసాయాన్ని కార్పొరేటర్లకు అప్పగించే ప్రయత్నం చేపట్టే దిశగా మోదీ సర్కారు అడుగులు వేస్తున్నది. తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ పోరాటం వృథా కాదు. వడ్లు కొనేదాకా సీఎం కేసీఆర్కు అండగా ఉండి పోరాటం చేస్తాం.
– పెంబర్తి శ్రీశైలం, రైతు సంఘం నాయకుడు, లచ్చపేట, దుబ్బాక