మెదక్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ , గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో 99 రోజు ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేశారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అధికార యంత్రాంగానికి మంత్రి దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులు వేగిరం చేయాలని, పథకాలు అర్హులకు అందేలా కలెక్టర్ల పర్యవేక్షణలో అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కృషిచేయాలని మంత్రి వివేక్ సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా నీటి ఎద్దడి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.
మరమ్మతుల దృష్ట్యా సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు మరమ్మతులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష చేశారని మంత్రి వివేక్ గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ప్రధాన రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రమాదాలు నివారించేందుకు పోలీసు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని మంత్రి వివేక్ సూచించారు.
తరుచూ గురుకుల పాఠశాలలను కలెక్టర్లు తనిఖీ చేసి, విద్యార్థులకు సమస్యలు తెలుసుకోవాలన్నారు. సౌకర్యాల కల్పన, నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి నుంచి బీహెచ్ఈఎల్ వరకు 65వ జాతీయ రహదారి విస్తరణ పనులతో ట్రాఫిక్తో పాటు కాలుష్య సమస్య ఉత్పన్నం అవుతున్నందున వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్కు మంత్రి వివేక్ సూచించారు. కాలుష్య నియంత్రణ అధికారుల తనిఖీలు చేయాలన్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ఫ్యాక్టరీలు ముందుకు వస్తే భూమి అప్పగించాలన్నారు. రెవెన్యూ డివిజన్, తహసీల్ కార్యాలయాల భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లో రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు 4 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంత్రి వివేక్ దృష్టికి తీసుకు పోయారు. దీనికి మంత్రి స్పందించి వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి రైతు బీమా సౌకర్యం కలిపించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికను అధికారులు విజయవంతం చేయాలన్నారు. ప్రతి శాఖపై సమీక్ష చేసి మండల స్థాయి అధికారులకు సూచనలు, సలహాలు అందించాలని మంత్రి వివేక్ అన్నారు. సమావేశంలో జహీరాబాద్, మెదక్ ఎంపీలు సురేశ్ కుమార్ షెట్కార్, రఘునందన్రావు, నారాయణఖేడ్, మెదక్ ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, రోహిత్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు ప్రతిమాసింగ్, ప్రావీణ్య, కె.హైమావతి, మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్లు నగేశ్, మాధురి, అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. గతేడాది సంభవించిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల్లకు మరమ్మతులు చేయాలని మంత్రి వివేక్ను కోరారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మెదక్ జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే రోహిత్రావు కోరారు.
-మెదక్ ఎమ్మెల్యే రోహిత్
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో రైతులకు సాగునీరు అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టాలని మంత్రి వివేక్ దృష్టికి తెచ్చారు.
-టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి
మెదక్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లో గతేడాది భారీ వర్షాలకు రోడ్లు, కల్వర్టులు, చెరువులు, చెక్డ్యామ్లు దెబ్బతిన్నాయని, పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని సమావేశంలో మంత్రి వివేక్ దృష్టికి ఎంపీ తెచ్చారు. మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని, రైతులకు పరిహారం అందించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి మెదక్ కు వచ్చినప్పుడు రామాయంపేటలో బస్టాండ్ విస్తరణతో పాటు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీలు నిలబెట్టుకోవాలని ఎంపీ కోరారు. దుబ్బాక, రామాయంపేట, పటాన్చెరులో ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రిని ఎంపీ రఘునందన్ కోరారు.
– మెదక్ ఎంపీ రఘునందన్
వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ మంత్రి వివేక్ దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి స్పందించి.. తాగునీటి సమస్యలు రాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
-జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్