‘ప్రతి పేదవాడి సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేస్తున్నారు. రూపాయి ఖర్చులేకుండా లక్షలు విలువచేసే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఉచితంగా అందిస్తున్న ఘనత ఆయనకే దక్కింది’. అని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో పాటు హైదరాబాద్కు చెందిన ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా చేపడుతున్నామని, రాజకీయాలు, కులమతాలతో సంబంధం లేకుండా కంప్యూటర్ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టు దేశంలో ఎక్కడైనా ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించామని, అవసరమైతే మరో లక్ష కట్టించేందుకు సిద్ధమన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
రామచంద్రాపురం/పటాన్చెరు, అక్టోబర్ 2: రాష్ట్రంలో నిరుపేదలందరికీ సొం తింటి కలను నెరవేర్చాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. లక్కీడ్రాలో పార్టీలకతీతంగా డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తున్నాయని, పేదలు రూపాయి ఖర్చు పెట్టకుండానే రూ.70లక్షలు విలువ చేసే డబుల్ బడ్రూం ఇండ్లను ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ఆగంకావద్దని, ప్రజల కోసం పనిచే స్తున్న బీఆర్ఎస్ పార్టీనే ఆశీర్వదించి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.
సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో లబ్ధిదారులకు డబుల్ఇండ్ల పట్టాల పం పిణీ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో మంత్రి మొక్క నాటారు. అనంతరం డబుల్ ఇండ్ల లక్కీడ్రాను ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ సెషన్లో సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం కట్టించలేదని సవాల్ విసిరితే ఆ సవాల్ని స్వీకరించిన నేను బట్టి విక్రమార్కను వెంటబెట్టుకొని హైదరాబాద్లో కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్ట్లను చూపించామని, అందులో భాగంగా కొల్లూర్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ని కూడా చూపించామని చెప్పారు. ఆ ఇండ్లను చూసి అన్ని గోడలే ఉన్నాయని వెటకారంగా మాట్లాడారని గుర్తుచేశారు.
గాలి మాటలు మాట్లాడితే కాదు, నిలబడి కట్టినోళ్లకు తెలుస్తది బాధ ఎంటో అని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలు చెప్పే వ్యక్తి కాదని చేతల్లో చూపించే వ్యక్తి అన్నారు. కరోనా వచ్చి రెండు సంవత్సరాల సమయం వృథా కావడంతోనే డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ ఆలస్యం జరిగిందని తెలిపారు. సకల సౌకర్యాలతో పేదలకు డబుల్ ఇండ్లను అందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కొల్లూర్లో 150 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్ట్ని ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్ముకోకుండా కాపాడుకోవాలని సూచించా రు. దేశంలో ఏదైనా రాష్ట్రంలో పేదల కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించినట్లు రుజువుచేస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. సెక్రటేరియేట్ నిర్మించేటప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నో విమర్శలు చేశారని, అందులో లంకెబిందెలు ఉన్నాయన్నారు. కానీ, నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంత అద్భుతమైన సచివాలయం ఎక్కడ కూడా లేదని అంటున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఏ పథకం చేపట్టినా, ఏ పని నిర్వహించినా చరిత్ర సృష్టిస్తుందన్నారు. కాళేశ్వరంతో బీడు భూములు పచ్చగా మారాయని, తాగునీటి కష్టాలు తీరాయని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు అందజేస్తున్నామని, గతంలో రూ.70 పింఛన్ ఉంటే సీఎం కేసీఆర్ రూ.2వేల పింఛన్ అందజేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ పండుగలను ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందన్నారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. సోమవారం కొల్లూ రులో పటాన్చెరుతోపాటు కూకట్పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, నాంపల్లి, గోషామహాల్ నియోజకవర్గాల నుంచి 6,067 మంది లబ్ధిదారులకు ప్రాంతంతో సంబంధం లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేశామని మంత్రి చెప్పారు.
ఐడీహెచ్ కాలనీ నుంచే శ్రీకారం
సనత్నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీలో ఉం డే స్లమ్ ఏరియాలోని పేదల ఇండ్లు కూలిపోయే దశకు చేరడంతో సీఎం కేసీఆర్కు తెలియజేయడంతోపాటు అ క్కడికి తీసుకెళ్లి చూపించామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ గుర్తు చేశారు. అప్పుడు సీఎం కేసీఆర్ ఆ ఇం డ్లను చూసి ప్రభుత్వం తరఫున కొత్త ఇండ్లను కట్టిద్దామని చెప్పారు. ప్రభుత్వ స్కీమ్లో భాగంగా 70శాతం ప్రభు త్వం 30శాతం లబ్ధిదారులు చెల్లించే విధంగా ఇండ్ల నిర్మా ణం చేపడుదామని సీఎం చెప్పడంతో స్లమ్ ఏరియా వారిని ఒప్పిస్తానని సీఎంకు చెప్పాను. మళ్లీ సీఎం పిలిచి వారందరూ ఏమి చేస్తారని అడిగారు. అప్పుడు వారందరూ గరీబోళ్లు అని చెప్పడంతో ఇంత కష్టపడి రాష్ట్రం సాధించుకున్నామని, పేదలతో డబ్బులు కట్టిస్తే బాగుండదు ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇండ్లు కట్టిస్తామని సీఎం చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ భూ ముల వివరాలను సీఎం తెప్పించుకొని డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలని సీఎం సంకల్పించారు. హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు వి లువ చేసే భూముల్లో కూడా పేదల కోసం సీఎం కేసీఆర్ అద్భుత టౌన్షిప్లను నిర్మించారని, నగరంతోపాటు జిల్లాల్లో కూడా పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టిస్తున్నామని చెప్పారు. పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను అందించేందుకు అవసరమైతే మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం కట్టిస్తుందన్నారు.
అర్హులందరికీ అందజేస్తాం
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. కొ ల్లూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ లక్షలు విలువ చేసే డబు ల్ బెడ్రూం ఇండ్లను ప్రభు త్వం రూపాయి ఖర్చు లేకుం డా లబ్ధిదారులకు అందజేస్తున్నదని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చిన ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని రాష్ర్టాల ప్రజలు ఉన్నారని, వారందరికీ సమన్యాయం చేస్తున్నామని చెప్పారు.
ఎలాంటి ఫైరవీలు లేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించామని చెప్పారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి ఇంటి పట్టాలు ఇస్తున్నామన్నారు. కొల్లూర్లో ఒక్కరోజే 6,067 డబుల్ బెడ్రూం ఇండ్లను పం పిణీ చేశామన్నారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్కు మద్దతు తెలి పి వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, మున్సిపల్ వైస్చెర్మన్ రాములుగౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, కౌన్సిలర్లు బాబ్జీ, శ్రీశైలం, నాగరాజు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మా దేవుడు
మాది బీదర్, బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వ చ్చాం. కొన్ని సంవత్సరాలుగా కిరా యి ఇంట్లో ఉం టూ బతుకుతు న్నాం. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తుందని తెలిసి దరఖాస్తు చేసుకున్నాం. ఎవరికి ఒక రూపాయి కూడా లంచం ఇవ్వలేదు. నిన్న ఫోన్ వచ్చింది మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఇంతమంచి డబుల్ బెడ్రూం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ సార్ కు రుణపడి ఉంటాం.
– ఆర్.లలిత, ఎల్లమ్మబండ, కూకట్పల్లి
కేసీఆర్ సారే మళ్లీ రావాలి
మాకు సొంత ఇల్లు ఇచ్చి సీఎం కేసీఆర్ మా కష్టాలు తీర్చా డు. ఇప్పటి వరకు మాకు సొంత ఇల్లు లేదు. మాకు సొం తింటిని అందజేసిన సీఎం కేసీఆర్కు అల్లా ఆశీస్సులు అందజేయాలని ప్రార్థన చేస్తా. సీఎం కేసీఆర్ సాబే మరోసారి సీఎం కావాలి. మా ఓటు కేసీఆర్ సాబ్కే వేస్తాం. డబుల్ బెడ్రూం ఇంటి పట్టా తీసుకోవడం చాలా ఖుషీగా ఉంది. రూపాయి ఖర్చు లేకుండానే సీఎం మాకు ఇల్లు ఇచ్చారు. బహుత్ షుక్రియా సీఎం కేసీఆర్ సాబ్.
– కామర్ ఉనీస్సా, చార్మినార్