సంగారెడ్డి కలెక్టరేట్, మే 30: జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, వేడుకలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమన్వయంతో పని చేసి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.
గ్రామం లో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పల్లెప్రగతి, రైతు దినోత్సవం, తెలంగాణకు హరితహారం, చెరువుల పండగ వంటి వేడుకలు ఘనంగా జరగాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని, జాతీయ జెండాను ఆవిష్కరించాలని వివరించారు. మొత్తం 21 రోజుల పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులందరూ దశాబ్ది వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.