ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో, చౌటకూరు మండలంలోని శివ్వంపేట, అందోలు మండలంలోని అల్మాయిపేట, సంగుపేట గ్రామాల్లో, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్, టేక్మాల్ మండలం చల్లపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తులను పరిశీలించి ఆర్హులందరికీ ఆరు గ్యారెంటీలను వర్తింపజేస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీలు, ఎనిమిది మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా 99 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాగా ప్రొటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా బీఆర్ఎస్
ఎమ్మెల్యేల ఫొటోలను ముద్రించలేదని మండిపడ్డారు.
అందోల్, డిసెంబర్ 28: రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మండలంలోని అల్మాయిపేట్, సంగుపేట్ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పథకాన్ని ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. అధికారులు, పార్టీ నాయకులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఆర్డీవో పాండు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మండల ప్రత్యేకాధికారిణి గీత, ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.
చౌటకూర్, డిసెంబర్ 28: ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాతనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మండలంలోని శివంపేట గ్రామంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీజైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్, ఎంపీపీ పట్లోళ్ల చైతన్యవిజయభాస్కర్రెడ్డితో జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. దరఖాస్తుల స్వీకరణ నితరంతర ప్రక్రియ అన్నారు. అనంతరం వెంకటకిష్టాపూర్ గ్రామంలోని శ్రీరుక్ష్మిణీ పాండురంగస్వామిని మంత్రి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో పాండు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, డిసెంబర్ 28: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ఆయా వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలనలో మంత్రి పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీరవి, కలెక్టర్ శరత్కుమార్, ఎస్పీ చెన్నూరి రూపేశ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎంపీపీ లావణ్య, కమిషనర్ సుజాత, డీఈఈ ఇంతియాజ్, టీపీవో కరుణాకర్తోపాటు వార్డు మహిళలు పాల్గొన్నారు.