మెదక్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్లో మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థ్ధి వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఫారూక్ హుస్సేన్, మాణిక్యం, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బట్టి జగపతి, సోములు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ… వంద రోజుల కాంగ్రెస్ పాలన అందరికీ అర్థం అయ్యిందన్నారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ అని, రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని హామీలు ఇచ్చి, మాట తప్పారని విమర్శించారు. మహాలక్ష్మీ పేరిట మహిళలకు రూ.2500 ఇస్తామని మోసం చేశారని గుర్తు చేశారు. అవ్వ, తాతలకు రూ.4వేల పింఛన్ ఇస్తామని, ఇప్పటికే ఒక్కొక్కరికీ రూ.8వేలు బాకీ పడ్డారన్నారు. రైతుబంధు రూ.15వేలకు పెంచుతా మని చెప్పి, ఇప్పటికీ రైతుబంధు ఇవ్వని కాంగ్రెస్కు ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని హెచ్చరించారు. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కల్యాణలక్ష్మి చెక్కు తోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇవ్వలేని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు.
రోజుకూ 18 గంటలు కష్టపడే వ్యక్తి.. గొప్ప మనసున్న వెంకట్రామిరెడ్డిని పార్లమెంట్కు పంపాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. పేద విద్యార్థుల కోసం రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్టు వెంకట్రామిరెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేశాడని, రాజ్యాంగం తెలిసిన వెంకట్రామిరెడ్డి తెలంగాణ కోసం గళం విప్పుతారని తెలిపారు. ఎంపీగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్రావును 50 వేల పైగా ఓట్లతో చిత్తుగా ఓడించారని, డిపాజిట్లు రాని బీజేపీకి మళ్లీ అదే గతి పడుతుందని హరీశ్రావు అన్నారు. బీజేపీ గెలిస్తే తెలంగాణకు ప్రయోజనం ఉండదన్నారు.
మెదక్ ఎంపీగా నన్ను గెలిపించండి.. మీకు సేవ చేస్తానని మెదక్ ఎంపీ అభ్యర్థ్ధి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉమ్మడి మెద క్ జిల్లాలో కలెక్టర్గా, డ్వామా పీడీగా పని చేసిన అనుభవం ఉందని, ఆ అనుభవంతోనే కేసీఆర్ ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మెదక్ ఎంపీగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ ల్యాండ్స్ నిధులు వస్తే మెదక్ ఎంపీ పరిధిలోని నియోజకవర్గాలకు కేటాయిస్తానని చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో సొంత డబ్బులతో ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తానని హామీనిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఆయనకు జిల్లాపై అవగాహన ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్కు కానుకగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.