పెద్దపెద్ద బస్తాలు మోసి.. మోసి మోకాళ్ల నొప్పులు మోపయినయ్.. నడువత్తలేదు.. కూసోవత్తలేదు. దేవుడా ఇంత మందు తీసుకుని సత్తామన్నంత బాధైతంది.. సేతిలో పైసాలేదు.. ఆపరేషన్సెయ్యించుకుందామంటే మూడులచ్చలు అడుగుతండ్రు.. ఏం జెయాలనే రంది పట్టుకుంది.. నొప్పులు పోతలేవు.. పైసలు దొరుకుతలేవు.. పైసలు లేక రెండునెల్లు ఇంట్లనే ఉన్న.. ఇంతల సర్కారు దవాఖానలో ఆపరేషన్లు జేత్తరని చెబితే పోయి సూయించుకున్న.. రెండు ఆపరేషన్లు చేసిండ్రు.. గిప్పుడు మంచిగనడుత్తున్న.. ఇది హుస్నాబాద్ పట్టణానికి చెందిన హమాలీ కార్మికుడు తిప్పట్ల రాజయ్య మనోగతం.. ఇలా ఎంతోమంది ప్రైవేటులో చూయించుకోలేక సర్కారు దవాఖానలే దిక్కని పానం బాగు చేసుకున్న వాళ్లెందరో.. అవగాహన లేక.. పక్కవాళ్లు ఏమనుకుంటరో అని వేలకు వేలు ప్రైవేటు దవాఖానల పైసలు ఖర్చు చేసుకున్న వాళ్లు ఉన్నారు.
హుస్నాబాద్ టౌన్, ఆగస్టు 17: ఒకప్పుడు వైద్యం కోసం ప్రైవేటు దవాఖానలు, జిల్లా కేంద్రాల్లోని దవాఖానలకు పరుగులు పెట్టిన జనం.. నేడు జనం ఉన్నచోటనే దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడానికి తోడు వివిధ రకాల సర్జన్లను సైతం నియమించడంతో ప్రజలు సర్కారు దవాఖాన బాటపట్టారు. డిసెంబర్ 5వ తేదీన హుస్నాబాద్ సామాజిక ఆరోగ్యకేంద్రంలో మాతా, శిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్ తదితర వైద్య సేవలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ప్రారంభించారు.
వివిధ రకాల సర్జన్లను నియమించడంతో హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలోనే పలు రకాల ఆపరేషన్లు చేస్తుండటంతో వైద్యం చేయించుకునేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. దాదాపు 35 ఏండ్లపాటు హమాలీ కార్మికుడిగా పనిచేసిన రాజయ్య రెండుమోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడ్డాడు. ప్రైవేట్ దవాఖానలో చూపించుకుంటే రెండు మోకాళ్లకు ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. పేద కుటుంబానికి చెందిన రాజయ్యకు ప్రైవేటులో చూపించుకునే ఆర్థిక స్థోమత లేక రెండు నెలలు బాధను భరిస్తూ ఇంటికే పరిమితమయ్యాడు. ఆపరేషన్ ఇక జన్మల కాదు అనుకున్న రాజయ్య ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో హుస్నాబాద్ సర్కారు దవాఖానకు వెళ్లి డాక్టర్లకు చూపించాడు. అక్కడ ఆర్థోపెడిక్ వైద్యుడు వెంకటరితీశ్ పరీక్షలు చేసి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే ఆపరేషన్ చేస్తామని పరీక్షలు చేశారు. డిసెంబర్లో కుడికాలు మోకాలు ఆపరేషన్ చేసిన వైద్యులు మేలో ఎడమ కాలు మోకాలుకు ఆపరేషన్ చేశారు. ఇలా రాజయ్యతోపాటు మరో ఐదుగురికి విజయవంతంగా మోకాలు ఆపరేషన్లు చేయడంతో ప్రజలు సర్కారు దవాఖాన బాటపడుతున్నారు. సర్కారు దవాఖానలో పైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకున్న రాజయ్య ఇప్పుడు ఏ నొప్పులు లేకుండా సంతోషంగా నడుస్తున్నాడు.
కిలోమీటర్ నడవాలంటే మోకాళ్ల నొప్పులతో రెండు గంటలు పట్టేది. నడవలేక, కూసోలేక చానా ఇబ్బందులు పడ్డా. హుస్నాబాద్ సర్కారు దవాఖానల ఆపరేషన్ చేయించుకున్నంక 15 నిమిషాల్లోనే పోతున్న.. తెలంగాణ వచ్చినంక దవాఖానలు మంచిగయినయ్. నాకు ఆపరేషన్ జరిగి బాగుపడ్డప్పటి నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారందరికీ సర్కారు దవాఖానకే పొమ్మని జెప్తున్న. మోకాళ్ల నొప్పులు పోయి సంబురంగా ఉంటున్న అంటే అది మన సర్కారు దవఖాన దయనే..
– తిప్పట్ల రాజయ్య, హుస్నాబాద్టౌన్
హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఐదుగురికి మోకాలు ఆపరేషన్లను విజయవంతంగా చేశాం. ప్రైవేట్ దవాఖానల్లో రూ.లక్షలతో అయ్యే ఆపరేషన్లను ఉచితంగా చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేస్తున్నాం. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. సర్కారు వైద్యాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
– రమేశ్రెడ్డి, సూపరింటెండెంట్, హుస్నాబాద్ సర్కారు దవాఖాన