నాడు స్వరాష్ట్రం కోసం ఒక్కడై కదిలాడు.. రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తీర్చాడు.. అందరి సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేశాడు.. యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. నేడు దసరా(విజయ దశమి) పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తున్నందున సబ్బండ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కేసీఆర్ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలు చూసి, కేసీఆర్ పీఎం కావాలని కోరుకుంటున్నాయి. ఈ దేశ ప్రజల కష్టాలు తెలిసిన మహానాయకుడా! జయీ భవ.. విజయీ భవ.. అంటూ దీవిస్తున్నాయి.
సిద్దిపేట, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని సబ్బండ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడంపై అందరూ హర్షిస్తున్నారు. నేడు దసరా(విజయదశమి) పర్వదినం సందర్భంగా కేసీఆర్ నోటినుంచి జాతీయ పార్టీ ప్రకటన వెలువడగానే ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించడానికి సకల జనులు సిద్ధ్దమమయ్యారు. టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో దూసుకుపోయిన ‘కారు’.. ఇక జాతీయస్థాయిలో రెట్టించిన ఉత్సాహంతో పరుగులు తీయనున్నది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్.. ఇక జాతీయ పార్టీగా రూపాంతరం చెందనున్నది. ఉక్కు సంకల్పంతో ఉద్యమం చేపట్టి.. ప్రజలందరినీ ఏకంచేసి.. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ మన జిల్లా ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడక నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్, నేడు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి పార్టీ పెడుతుండడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కేసీఆర్ సొంతం. అంతటి మహోన్నత వ్యక్తి మనబిడ్డ కావడంపై మెతుకు సీమ ప్రజలు మురిసిపోతున్నారు.
సిద్దిపేట గడ్డ నుంచి ఉద్యమం..
తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. ఉద్యమంలో ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా, గాంధేయ మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జనాన్ని కదిలించారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు.కేసీఆర్. ఆనాటి ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఇప్పటికీ జనం హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. సిద్దిపేట గడ్డ నుంచి రాజకీయం ఎదిగి తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి ప్రజల అకాంక్షలు సాకారం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు చేపట్టిన సకల జనుల సమ్మెతో పాలన స్తంభించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్యమం విజయవంతంగా చేపట్టారు. 14ఎఫ్ రగడ, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, హైదరాబాద్ నగరాన్ని ఆరో జోన్ నుంచి వేరు చేస్తూ ఫ్రీజోన్ మార్చేందుకు తీసుకున్న సమయంలో మెతుకు సీమ ప్రజలు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ‘ఫ్రీజోన్ కాదురా.. హైదరాబాద్ మాదిరా’.. పేరిట 14ఎఫ్కు వ్యతిరేకంగా ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో నిర్వహించిన ఉద్యోగ గర్జన భారీ బహిరంగ సభ కేసీఆర్ సంచలన నిర్ణయానికి వేదికైంది. ఈ సభలో కేసీఆర్ తెలంగాణ కోసం తాను 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతానని సంచలన వాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేట దీక్షా స్థలానికి చేరుకుంటున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో సిద్దిపేట ఆమరణ నిరాహార దీక్ష స్థలిలో అప్పట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేసీఆర్ అరెస్టు వార్త విన్న వెంటనే సిద్దిపేటలోని రంగధాంపల్లి దీక్షా శిబిరంలో అలజడి మొదలైంది. కేసీఆర్ అరెస్టు వార్త తెలుసుకున్న వెంటనే ఆయన స్థానంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి హరీశ్రావు దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా స్థలి వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు బారికేడ్లను బద్ధలు కొట్టి దీక్షా ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఓవైపు పోలీసులు తెలంగాణ వాదులపై లాఠీలు జులిపిస్తే.. మరోవైపు కోపోద్రిక్తులై తెలంగాణ వాదులు జైతెలంగాణ అని నినదించారు. కొన్ని నిమిషాల వ్యవధిలో శిబిర ప్రాంగణం ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగింది. అసలేం.. జరుగుతుందో.. తెలుసుకునే లోపే టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తెలంగాణ వాదులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు. పోలీసు అధికారుల వైఖరితో ఒక దశలో తీవ్ర ఉద్వేగానికి లోనైన హరీశ్రావు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా శిబిర ప్రాంగణంలోకి దూసుకొచ్చి హరీశ్రావు సహా ముఖ్య నాయకులను అరెస్టు చేసి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యమకారులు, ఉద్యోగులు నిరంతరం తమ వాణిని వినిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా ఉమ్మడి మెదక్ ప్రజలు విజయవంతం చేశారు. ఆది నుంచి ఆయనకు అండగా నిలిచారు.
ప్రజలు మెచ్చేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు
సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ చేపట్టిన పలు పనులు నేడు రాష్ట్రస్థాయిలో పథకాలుగా అమలవుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు తాగునీటి గోస లేకుండా చేయడానికి అప్పట్లో ఆయన పనులు చేపట్టారు. ఆ పనుల స్ఫూర్తితోనే రాష్ట్రవ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకం పుట్టుకు వచ్చింది. దీనిని విజయవంతంగా అమలుచేస్తూ ఇంటింటికీ నల్లాల ద్వారా తాగు నీరందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో చేపట్టిన పలు చెక్డ్యామ్ల స్ఫూర్తితో ‘మిషన్ కాకతీయ’ పురుడుపోసుకుంది. ఈ పథకం ద్వారా చెరువుల పూడికతీత తీసి కట్టలను బలోపేతం చేయడంతో చెరువులు జలాలతో నిండుగా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తెచ్చి సాగునీటి కష్టాలను తీర్చారు. రైతాంగానికి ‘రైతుబంధు’ ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి వ్యవసాయ క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించారు. జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైంది. కొత్త జీపీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేశారు.
నూతనంగా కలెక్టరేట్ భవనాలు నిర్మించారు. ప్రభుత్వ దవాఖానలను అత్యాధునికంగా నిర్మించారు. మెడికల్ కళాశాల భవనాలు నిర్మించుకొని ప్రారంభించుకోవడం జరిగింది. రహదారుల నిర్మాణాలు, వివిధ వర్గాల వారికి సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ‘మనఊరు- మనబడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా తొలి విడతగా ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు ఇస్తూ పేదింట సీఎం కేసీఆర్ పెద్ద కొడుకుగా నిలిచారు. జిల్లాలో హరితహారం పెద్ద ఎత్తున చేపట్టి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా పేద ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నది. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పలు పథకాలకు విశేష స్పందన రావడంతో దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు ఆసక్తిగా చూడడమే కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి రాష్ర్టాల్లో అమలు చేసుకుంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగునీటి రంగానికి పెద్దపీట
వరుస కరువు కాటకాలు! రై తుల ఆత్మహత్యలు! సాగు నీరు లేక నోళ్లు తెరుచున్న భూములు! చేతినిండా పని లేక వలసలు! భీమండి, సూరత్ తదితర ప్రాంతాలకు వెళ్లి బతుకులు ఎల్లదీసిన రోజులు.. సమైక్య రాష్ట్రంలో నిత్యం కరువు కాటకాలతో అల్లాడింది మెతకు సీమ. సమైక్య రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన అప్పటి ప్రభుత్వాలకు గుర్తు రాలేదు.కనీసం తట్టెడు మట్టిని సైతం ఎత్తిపోయలేదు. ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు ఎదుర్కొన్న కష్టాలు. ఈ నడిగడ్డ ప్రాంతంలో రిజర్వాయర్ వస్తే మొత్తం తెలంగాణ బాగుపడ్తది అని ఈ ప్రాంతంలో సీఎం కేసీఆర్ ఇక్కడ రిజర్వాయర్ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. గోదావరి నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూరైంది.
ఇవ్వాళ స్వరాష్ట్రంలో రైతాంగానికి మంచి రోజులు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. వీటి ద్వారా పంట పొలాలకు సాగు నీరందుతున్నది. మెదక్ జిల్లాలో వనదుర్గ్గా ప్రాజెక్టు, హల్దీ ప్రాజెక్టులతో భూగర్భజలాలు బాగా పెరిగాయి. సాగు భూముల ధరలు ఆకాశన్నంటాయి. ప్రతి గుంట సాగులోకి వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. దీంతో ఇవాళ ఎటు చూసినా రిజర్వాయర్లు, సాగునీటి కాల్వలు, పచ్చని పంట పొలాల కనిపిస్తున్నాయి. బహుళ ప్రయోజనాలు కలిగిన కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ను 2022 ఫిబ్రవరి 23న సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సుమారుగా 8 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించే ఈ ప్రాజెక్టులతో మెతుకు సీమకు పూర్వ వైభవం వచ్చింది.సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం సైతం నోచుకోని ఉమ్మడి మెదక్ జిల్లాకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చిది.ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసే గోదావరి జలాలు మిడ్మానేరు నుంచి వస్తాయి. మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం పోస్తూ చివరి ప్రాజెక్టు అయిన సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టును 2020 ఏప్రిల్, మే నెలలో ముద్దాడగా…2022 ఫిబ్రవరి 23న సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ రిజర్వాయర్ను జాతికి అంకితం చేశారు. కూడవెల్లి వాగు, హల్దీవాగులు పరవళ్లు తొక్కాయి. ఫలితంగా వాటి కింద సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. ప్రతి గుంట సాగులోకి వచ్చింది. రైతులోకం అద్భుతాలు సృష్టిస్తున్నది.
ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండే స్వభావం కలిగిన వ్యక్తి సీఎం కేసీఆర్. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ తన చిన్ననాటి స్నేహితులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలను పేరుపెట్టి పిలిచే తత్వం ఆయనది. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడంతో పాటు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం ఆయనలో ఉన్న ప్రత్యేకత. కొన్ని సందర్భాల్లో సమయం చిక్కినప్పుడు మిత్రుల ఇండ్లలో జరిగే వేడుకలకు హాజరై వారితో ఉల్లాసంగా గడుపుతుంటారు. భోజనం చేసేటప్పుడు తన స్నేహితులతో కలిసి చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఆప్యాయంగా మెదిలి ప్రేమాభిమానాలు పంచుతూ అందరివాడిగా నిలిచారు.
సీఎం కేసీఆర్కారణజన్ముడు !
రాజకీయ చతురత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి తదితర వాటిపై పూర్తి పట్టున్న కేసీఆర్కు దేశ రాజకీయాలను శాసించ గల శక్తి ఉంది. పాఠశాల స్థాయి నుంచి కేసీఆర్ పట్టుదల, క్రమశిక్షణతో విద్యనభ్యసించి అనుకున్నది సాధించుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన కారణజన్ముడు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సులభంగా రాణించగలడు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ సేవలు, ఆలోచనలు చాలా అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించడంతో పాటు ప్రధాని అయ్యే అవకాశాలెన్నో ఉన్నాయి. ఆయన చేపట్టిన కార్యం సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా.
– గన్నె బాల్రెడ్డి, సీఎం కేసీఆర్ గురువు(విశ్రాంత ఉపాధ్యాయులు), దుబ్బాక
మా గ్రామస్తుల తరఫున మద్దతు
తెలంగాణలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో.. అట్లాగే దేశంలో కూడా ఇవే అమలు చేయాలనే ఉద్దేశంతో కొత్త పార్టీ పెడుతున్న సీఎం కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నాం. దేశం మొత్తం అభివృద్ధి జరగాలని కేసీఆర్ పార్టీ పెడుతున్నారు. ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి పథకాలు దేశం మొత్తం పెట్టాలనే ఉద్దేశంతో కొత్త పార్టీ పెడుతున్నరు. మా గ్రామస్తుల తరఫున మద్దతు తెలుపుతున్నం. చాలా సంతోషంగా ఉంది.
– మెతుకు రవి, చింతమడక
దేశ ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నరు
కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నరు. పార్టీ పెట్టి 14ఏండ్లు పోరాడి, తెలంగాణ తెచ్చి చూపించారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు తప్పకుండా కేసీఆర్ పీఎం కావాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నరు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు చూసిన ప్రజలు కేసీఆర్ పీఎం కావాలని కోరుకుంటున్నరు. మరి ముఖ్యంగా చింతమడక ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండడం సంతోషంగా ఉంది.
– కంతుల మల్లేశం, గ్రామస్తుడు, చింతమడక
సారు సీఎం అయినంక ఇల్లు వచ్చింది
కేసీఆర్ సారు సీఎం అయినంక మాకు ఇల్లు కట్టించిండు. ఇంటికి రూ.పది లక్షలు ఇచ్చిండు. ముసలోల్లకు పింఛన్ ఇస్తుండు. అందరికి మంచి చేసే కేసీఆర్ సారు.. ఇంకా పెద్ద పదవి రావాలె. ప్రధాన మంత్రి అయితే మంచిగుంటదు. మాలాంటి పేదోళ్లకు మంచి పనులు చేస్తడు.
– చెప్యాల మల్లవ్వ, చింతమడక
దేశ రాజకీయాల్లో ముందుకు పోవాలె
చింతమడక నుంచి కేసీఆర్ తెలంగాణను సాధించిండు. మా గ్రామస్తుల, రాష్ట్ర ప్రజల కోరిక మేరకు అనేక ఉద్యమాలు చేసిండు. ఎందరినో ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. వచ్చినంక సీఎం అయి అనేక పథకాలు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు అమలు చేస్తుండు. ఇలాగే దేశ రాజకీయాల్లో రాణించి ఇంకా పేరు తెచ్చుకోవాలె. మాకు చాలా సంతోషంగా ఉంది.
– నీరటి దేవరాజు, గ్రామస్తుడు, చింతమడక
సారు ప్రధాని కావాలె
చింతమడకకు ఎన్నో మంచి పనులు చేసిన కేసీఆర్ సారు. దేశంల ఉన్నోల్లకు కూడా మంచి చేత్తడు. ఇల్లు కట్టింస్తుండు. మాకు ఇల్లొంచ్చింది. రూ.పది లచ్చలు ఇచ్చుండు. చేసుకునోల్లకు పని దొరుకుతాంది. సారు సీఎం అయినంక ఊరు బాగుపడ్డది. అట్లనే దేశం కూడా బాగుపడాలె. అందరూ మంచిగుండాలె. సీఎం కేసీఆర్ సారు చల్లగా ఉండి అందరికి మంచి చేయాలె. అందరూ ప్రధాని అవుడని అంటుర్రు. మంచిగనిపిస్తాంది. సాన సంతోషం అయితున్నది.
– నిమ్మ కనుకవ్వ, గ్రామస్తురాలు, చింతమడక
వ్యక్తి కాదు.. ఓ శక్తి!
సీఎం కేసీఆర్ నాకు బాల్య మిత్రుడు. సీఎం పదవిలో ఉన్నా బాల్య మిత్రులను మరిచిపోలేదు. ఉద్యమంలో ఆయనతో కలిసి పని చేశా. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ ప్రవేశం ఓ చారిత్రక ఘట్టం. కేసీఆర్ తెలంగాణ ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు ఆత్మ బంధువుగా మారారు. తెలంగాణ సాధించి, అతి కొద్ది సమయంలోనే దేశంలో మోడల్గా నిలిపారు. కేంద్రంలో బీజేపీ నియంత పాలనతో ప్రజలంతా విసిగిపోయారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. ప్రజా సంక్షేమం కోసం పని చేసే నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నది. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు కారణం.
– రొట్టే రాజమౌళి, సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు, దుబ్బాక
సీఎం కేసీఆర్..గొప్ప నాయకుడు
సీఎం కేసీఆర్తో ఉన్న స్నేహ బంధం చాలా గొప్పది. దుబ్బాకలో 4వ తరగతిలో ప్రారంభమైన మా స్నేహం, సిద్దిపేటలో డిగ్రీ వరకు కొనసాగింది. డిగ్రీ చదువుకునే సమయంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మదన్మోహన్ తరఫున విద్యార్థుల్లో కొందరం ప్రచారానికి వెళ్లాం. కొండపాక మండలం మర్పడగలో ప్రచారం కొనసాగిస్తున్న తరుణంలో మదన్మోహన్ రావడం ఆలస్యమైంది. సభలో మాట్లాడేందుకు వక్తలు లేకపోవడంతో కేసీఆర్ను మాట్లాడాలంటూ స్నేహితులందరం కోరగా, ఆయన మైక్ పట్టుకొని ప్రసంగించే సమయంలో అక్కడికి వచ్చిన మదన్మోహన్ ఆశ్చర్యచకితులయ్యారు. సభికులు సైతం కేసీఆర్ ప్రసంగానికి మంత్ర ముగ్ధులయ్యారు. ఆ నాటి నుంచి కేసీఆర్కు రాజకీయ నేతలతో పరిచయం, తన ప్రసంగాలతో గొప్ప నాయకున్ని తయారు చేసింది. సమైక్య పాలకుల కుట్రలు, మోసాలను తెలంగాణ ప్రజానీకానికి అవగాహన కల్పించి, కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మరో పక్క దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది.
– కూర ప్రభాకర్, వ్యాపారి (కేసీఆర్ బాల్య మిత్రులు), దుబ్బాక
సీఎం కేసీఆర్తోనే బంగారు భారతం
కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఊహించని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమ లు కావడం సంతోషకరం. బాల్య మిత్రులను మరిచిపోకుండా ఆప్యాయంగా పలకరించడం కేసీఆర్కే సాధ్యపడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధమైన సమయంలో ఆందోళన పడ్డాం. విద్యార్థి దశ నుంచి నేటి వరకు వెనకడుగు వేయలేదు. అనుకున్న పని సాధించేంతవరకు విశ్రమించడు. కేసీఆర్ వ్యక్తి కాదు.. ఆయనొక శక్తి.. తెలంగాణ రాష్ట్రం సాధించడమే గాక అద్భుతంగా అభివృద్ధి చేశారు. దేశంలోని పేదలకు ఆయన అండగా ఉంటారు.
– పొడిశెట్టి లక్ష్మీనారాయణ, దుబ్బాక( సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు), దుబ్బాక
చింతమడక గ్రామపంచాయతీ