సిద్దిపేట, ఏప్రిల్ 12: అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్లో పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తల విసృ్తతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు చాలా కీలకమన్నారు. పట్టువదలకుండా పోరాడి రాష్ట్రాన్ని సాధించామని, ఉద్యమానికి, గులాబీ జెండాకు ప్రాణం పోసింది సిద్దిపేట గడ్డ అన్నారు. తెలంగాణ కోసం మొదటి అడుగు వేసింది సిద్దిపేట అని, నాడు కేసీఆర్ సిద్దిపేట ప్రజలను నమ్ముకొని డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేస్తే ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని చెప్పారు.
కాంగ్రెస్ మాటలు నీటి మూటలేనని, ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుందన్నారు. నాలుగు నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకతను చూసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. వడ్లకు మద్దతు ధర అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. జనగామ మారెట్లో క్వింటాల్ వడ్లకు రూ.1560 కొనడం లేదన్నారు. 30 రోజులు కార్యకర్తలంతా కష్టపడి పనిచేస్తే విజయం మనదే అన్నారు. తెలంగాణ రావడం వల్లనే సిద్దిపేట జిల్లా అయిందని, రైలు, గోదావరి నీళ్లు వచ్చాయని హరీశ్రావు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు ఏదైనా ఉందంటే సిద్దిపేటకు మంజూరైన పనులు, జరుగుతున్న వెటర్నరీ కాలేజ్ని రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించకుపోవడం అన్నారు. రూ.150కోట్ల అభివృద్ధి పనులు నిలిపివేశారన్నారు. వీటన్నింటికీ సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. సిద్దిపేటకు అన్యాయం జరిగితే, అక్కసు వెళ్లగక్కితే ఉరుకుందామా అన్నారు. సిద్దిపేట ప్రజలందరం.. చీము, నెత్తురు ఉన్నోళ్లం, మళ్లీ కాంగ్రెస్కు ఓట్లువేసి మోసపోదామా అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా, ఎన్నికల కోడ్ అని సన్నాయి నొకులు నొక్కుతున్న కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీలు అకసు వెళ్లగక్కుతున్నాయన్నారు. సీఎం రేవంత్రెడ్డికి పరిపాలించే సత్తా, సరుకు లేదని, అందుకే ఫోన్ ట్యాపింగ్ అని ప్రతిపక్షాలపైన బురద జల్లుతూ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుందన్నారు. బీజేపీ సంక్షేమానికి, పేదలకు వ్యతిరేకమన్నారు. వడ్లు కొనమంటే నూకలు తినమన్న బీజేపీకి ఎట్లా ఓట్లు వేస్తామన్నారు. అబద్ధాలు మాట్లాడడంలో బీజేపీ బడేమియా అయితే కాంగ్రెస్ చోటేమియా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటై కుట్రలు చేస్తూ బీఆర్ఎస్ను లేకుండా చేద్దామని చూస్తున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో పుట్లకొద్దీ వడ్లు పండితే ..కాంగ్రెస్ 4 నెలల కాలంలో రైతులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారన్నారు. సిద్దిపేటలో అనేక ఆలయాలను అభివృద్ధి చేశామని, కార్యకర్తలు ఏమరుపాటుగా ఉండొద్దన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు దుబ్బాక ఉప ఎన్నికలో అబద్ధాలు చెప్పి గెలిచి నాలుగేండ్లు దుబ్బాకకు ఏమి చేయకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టి 50,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపించారన్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి సిద్దిపేటలో ఎలా చెల్లుతుందన్నారు.
గతంలో మెదక్ పార్లమెంటు స్థానంలో విజయశాంతిని గెలిపించిన చరిత్ర సిద్ధిపేటన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై అనేక స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టారన్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, బీజేపీని ఓడించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ముస్లింలు గుర్తించాలని మాజీమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మెదక్ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ కంచుకోట అని, 2004 నుంచి 2024 వరకు బీఆర్ఎస్దే విజయమన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన భవన నిర్మాణ రంగ కార్మికులు బీఆర్ఎస్కు మద్దతిచ్చిన ఏకగ్రీవ తీర్మాణాన్ని హరీశ్రావుకు అందజేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ జంగిటి కనకరాజు, బీఆర్ఎస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు టైగర్ నరసమ్మ, సీనియర్ నాయకులు వంగా నాగిరెడ్డి, బాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పూజల వెంకటేశ్వరరావు (చిన్న), మోహన్లాల్, ఎల్లు రవీందర్ రెడ్డి, లోక లక్ష్మీరాజ్యం, బుర విజయామల్లేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు అపర్ణాశ్రీనివాస్, మెరుగు మహేశ్, రజనీకాంత్రెడ్డి, రెడ్డి యాదగిరి, రెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.