దుబ్బాక/దుబ్బాక టౌన్, నవంబర్ 9: పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటేనే బాగుంటది. అదేమాదిరిగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ర్టాన్ని సాధించిన మన కేసీఆర్ చేతుల్లో తెలంగాణ ఉంటేనే క్షేమంగా ఉంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కావడం పక్కా అన్నారు. దుబ్బాకలో ఓ మాటకారికి.. మంచి మనిషికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. గురువారం దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో మంత్రి హరీశ్రావు నామినేషన్ సెట్ వేయించారు. ఎంపీ ప్రభాకర్రెడ్డి 10 రోజుల క్రితం ఓ దుండగుడి చేతిలో కత్తి దాడికి గురై గాయాలతో హైదరాబాద్ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం అక్కడి నుంచి నేరుగా అంబులెన్సులో దుబ్బాక రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చారు. ప్రభాకర్రెడ్డితో మంత్రి హరీశ్రావు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ సెట్ వేయించారు. ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైద్యుల సూచన మేరకు తిరిగి అంబులెన్సులో దవాఖానకు తరలించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు దుబ్బాక పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్రెడ్డి తనయుడు పృథ్వీరెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి మంత్రి హరీశ్రావు మాట్లాడారు. గత కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంత రైతులు, చేనేతలు ఎందరో ఆత్మహత్య చేసుకున్నారని, నేడు కేసీఆర్ సర్కారులో పేదలకు కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర ఉన్నదన్నారు. కేసీఆర్ సర్కారులో ఒక్క గుంట బీడు లేదు, మోటర్లు కాలటం లేదు., ట్రాన్సుఫార్మర్లు పేలటం లేదని తెలిపారు. రైతు బంధు సృష్టికర్త మన సీఎం కేసీఆర్ అని, ఎకారానికి రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచడం సంతోషకరమని తెలిపారు.
ఎండాకాలంలో కూడవెల్లి వాగు పారుతుందని కల గన్నమా? కాళేశ్వరంతో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని, పచ్చదనంతో పాడిపంటలు సిరులు కురిపిస్తున్నాయన్నారు. దుబ్బాక గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ ప్రభాకర్రెడ్డిని అత్యాధిక మెజార్టీతో గెలిపిస్తే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేసే బాధ్యత తనదేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను పట్టా భూములుగా మార్చుతామని, ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉమ్మడి మెదక్లో పదికి 10 గెలుస్తాం ఈ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీవేనని, జిల్లాలో పది సీట్లు గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి సారించామని, 10 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు వచ్చేది లేదు.. సచ్చేది లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి అత్యంత హేయనీయమన్నారు. ఈ ఘటనపై మానవత్వం చూపకుండా ఒకడు కోడి కత్తి అంటూ.. మరొకడు మొండి కత్తి అంటూ మాట్లాడటం బాధాకరమన్నారు. అలాంటి నాయకులకు దుబ్బాక ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. దుబ్బాకలో ఓ మంచి మనిషికి.. కోతలరాయుడికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. ఆయనను దవాఖాన నుంచి అంబులెన్సులో దుబ్బాకకు తీసుకొచ్చి నామినేషన్ వేసే పరిస్థితి రావటం బాధాకరమన్నారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు కోతలరాయుడి మాటలు నమ్మి మోసపోయారని, మళ్లీ మోసపోవద్దని కోరారు. దుబ్బాక అంటే సీఎం కేసీఆర్కు ఎనలేని మమకారమని, తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మనోహర్రావు, వెంకటనర్సింహారెడ్డి, రాజమౌళి కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు సోలిపేట సతీశ్రెడ్డి, మామిడి మోహన్రెడ్డి, రొట్టె రాజమౌళి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటేస్తే.. దుబ్బాకలో చదువుకున్న కేసీఆర్ సారు సీఎంగా ఉంటారని, పక్కనున్న (సిద్దిపేట నియోజకవర్గం)నేను మంత్రిగా, దుబ్బాకలో ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో తోడుంటామని, దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మంత్రి హరీశ్రావు అన్నారు.
ఎన్నికల ప్రచార నిమిత్తం దుబ్బాకకు ఈ నెల 26న సీఎం కేసీఆర్ వస్తున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. దుబ్బాకకు కావలసిన అభివృద్ధి వరాలు సీఎం నోట వెలువడే అవకాశం ఉన్నదన్నారు.
తెలంగాణ రాకుంటే కాళేశ్వరం వచ్చేది కాదు.. 24 గంటల కరెంట్ ఉండేది కాదు. రైతులకు రైతుబంధు ద్వారా 11 విడతల్లో 74వేల కోట్లు ఇచ్చామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ‘రైతుబంధు’ను అవమానపరుస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.