పటాన్చెరు/అమీన్ఫూర్, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రాణదాత. ఒక వైపు ప్రాణాలు నిలిపే వాక్సిన్లను హైదరాబాద్ కేంద్రంగా తయారు చేస్తున్నాం. బల్క్డ్రగ్స్కి తెలంగాణ కేంద్రం, ఇప్పుడు మెడికల్ ఎక్యూప్మెంట్లు తయారు చేసి ప్రాణాలు కాపడుతున్నాం. మా నిబద్ధత, ముందుచూపు, సేవాభావం కూడా దేశభక్తికి నిదర్శనం. అలాంటి అంకితభావంతో స్టంట్ల తయారీకి పూనుకున్న ఎస్ఎంటీ యజమాన్యాన్ని ఎంత కొనియాడిన తక్కువే. ఇలాంటి గొప్ప పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం మాకు ఎంతో గర్వకారణం. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రతి స్టంట్ ఒక గుండెలో అమర్చబడి ఒక ప్రాణం కాపాడబడుతుంది. కాపాడబడే ప్రతి గుండె మనకు ధన్యవాదాలు చెబుతుంది అంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్లో గుండె స్టంట్లు తయారు చేసే సహజానంద్ మెడికల్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్ఎంటీ) పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్లోబల్ హబ్ ఫర్ మ్యానుఫ్యాక్షరింగ్, ఆర్అండ్డీ యూనిట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పరిశ్రమ ఆవరణలో ఎస్ఎంటీ సంస్థ చైర్మన్ ధీరజ్లాల్ కొటాడియాతో కలిసి మొక్క నాటారు.
పార్క్లో పనులు ప్రారంభం కావడం సంతోషకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్లో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (స్టంట్ల తయారీ పరిశ్రమ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరుస్తూ స్వయం ఉత్పత్తులను చేసుకునే దిశగా కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యంగా మెడికల్ సంబంధిత ఉత్పత్తుల తయారీ సంస్థలను రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవడంతో గుండె వ్యాధిగ్రస్తులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. 2018లో మెడికల్ డివైజ్ పార్క్లో సహజానంద్ సంట్ల తయారీ సంస్థకు శంకుస్థాపన చేసి నేడు ఉత్పత్తుల తయారీని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ పరిశ్రమలో 300 మంది సైంటిస్టులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సంస్థ తయారు చేసిన మెడికల్ ఉత్పత్తులను సుమారుగా 70 దేశాలకు ఎగుమతి చేస్తుందని గుర్తు చేశారు. ఇటువంటి పెద్ద యూనిట్లు తెలంగాణలో స్థాపించడంతో ఈప్రాంత అభివృద్ధికి అండగా నిలుస్తాయన్నారు. రెండు సంవత్సరాల కొవిడ్ దుర్భర పరిస్థితులను అధిగమించి ఎస్ఎంటీ సంస్థ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయడం గర్వకారణమన్నారు. మెడికల్ ఉత్పత్తులను 80శాతం పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితులను అధిగమించేందుకు మెడికల్ డివైజ్ పార్క్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సుల్తాన్పూర్ ప్రాంతంలో అతిపెద్ద పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి ఈ మెడికల్ డివైజ్ పార్క్లో 50 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. అందులోనూ పరిశ్రమ నిర్మాణాలు పూర్తి చేసుకొని ఉత్పత్తులు ప్రారంభమవుతున్నాయన్నారు.
ఎస్ఎంటీ సంస్థ సంజీవని ప్రాజెక్టు మొదటిదశను తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఒక మెడికల్ షాప్లో పేదవాడు మందులు కొనేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి మెడికల్ రంగంలోకి వచ్చారన్నారు. ఆయనే ఆ సంస్థ చైర్మన్ ధీరజ్లాల్ అని కేటీఆర్ కొనియాడారు. అంకితభావం, సేవా భావం, మానవత్వంతో ఆయన చేసిన పనులు పేదలకు వరంలా మారయన్నారు. 20 ఏండ్ల క్రితం రూ.6 లక్షలతో స్టంట్స్ గుండెలకు వేసేవారన్నారు. ఇప్పుడు రూ.లక్ష లోపు ఈ సేవలు అందుబాటులోకి రావడం హర్షనీయమన్నారు. సుల్తాన్పూర్లో ప్రారంభించిన మెడికల్ డివైజ్ పార్కులోకి దాదాపు 50 పరిశ్రమలు వచ్చాయన్నారు. ప్రజారోగ్యానికి తెలంగాణ భరోసా ఇస్తున్నదని, ఇక్కడ తయారయ్యే ప్రతి వైద్య పరికరం సాధారణ ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని రకాల పరిశ్రమలు ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ముఖ్యంగా వైద్య రంగంలో సేవలు చవక కావాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణలో అత్యుత్తమమైన పరిశ్రమల పాలసీలను పెట్టి పరిశ్రమలను పెట్టిస్తున్నామన్నారు. పరిశ్రమల రాకతో ఇక్కడ ఉత్పత్తులు పెరుగుతున్నాయన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి లభిస్తున్నదన్నారు. వైద్య రంగానికి కూడా చవకగా పరికరాలు లభ్యమవుతున్నాయన్నారు. ఇప్పటికి 80శాతం ఉత్పత్తుల ను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. మేక్ఇన్ఇండియా నినాదం కాకుండా ఆచరణలో ఉండాలనే లక్ష్యం మాదన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలను ఆహ్వానించడంతో పాటు వారికి మౌలిక వసతులను కల్పించి ప్రోత్సహిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైద్య పరికరాల దిగుమతిని నిలిపివేసేలా స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమగ్ర విధానం ఉంటేనే దిగుమతులు తగ్గి దేశీయం గా వైద్య సేవలు తక్కువకు లభిస్తాయన్నారు. ఎస్ఎంటీ సంస్థ తయారు చేసే స్టంట్స్ అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత కలిగి ఉంటాయన్నారు. గొప్ప సంస్థ తెలంగాణలో తమ పరిశ్రమ పెట్టడం మాకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఆర్డీవో నగేశ్, అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, సర్పంచ్ భాస్కర్గౌడ్, టీఆర్ఎస్ యువత నాయకులు వెంకటేశంగౌడ్, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, సహజానంద్ గ్రూప్ నిర్వాహకులు రాజీవ్ చిబ్బర్, భార్గవ్ కొటాడియా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భేష్: ధీరజ్లాల్ కొటాడియా
తెలంగాణ రాష్ట్రం భేష్. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం ఉత్తమమైంది. మంత్రి కేటీఆర్ డైనమిక్గా వ్యవహరిస్తూ ఒక విజన్తో ముందుకుపోతున్నారు. నిరంతరం అంకితభావంతో వారు పడుతున్న శ్రమకు తగ్గ గుర్తింపు వస్తున్నది. మా గురువులు కూడా మంచి పనులు చేయాలని ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేము ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య పరికరాల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము తయారు చేసే ప్రతి స్టంట్ ఒక ప్రాణాన్ని కాపాడుతుందనే భావన మాలో గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. రోగులకు ఇలా సేవచేస్తున్నామనే సంతృప్తి ఉంది. భగవాన్ స్వామి నారాయణ్ చెప్పినట్లుగా చదువుతో పాటు సంస్కారం ఉండాలనేది మేము అమలు చేస్తున్నాం. ఏ పని చేసినా ప్రజలకు ఉపయగపడాలనేది మా తాపత్రయం. ఈ వైద్య పరికరాల పరిశ్రమ ఆర్అండ్డీ నుంచి మరిన్ని మంచి పరిశోధనలు జరిగి కొత్త ఉత్పత్తుల కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణలో అందరి సహకారం బాగుంది.
పరిశ్రమ లోపల పర్యటన పరిశీలన..
మంత్రి కేటీఆర్ అనుకున్న సమయం కంటే 10 నిమిషాల ముందుగా పరిశ్రమకు చేరుకొని సంస్థ నిబంధనలతో పర్యటించి ఉత్పత్తుల పని తీరును పరిశీలించారు. సుమారు గంటకు పైగా ప్రతి పరికరం పనితీరు, తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సైంటిస్టులు, పరిశ్రమ నిర్వాహకులు మంత్రి వెంట ఉండి పరికరాల గురించి వివరించారు. ఆయనవెంట సహజానంద్ గ్రూప్ఆఫ్ కంపెనీ చైర్మన్ ధీరజ్లాల్ కొటాడియా, రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ ఉన్నారు.