వెల్దుర్తి, ఏప్రిల్ 18: మహిళల్లో తీవ్రమైన అరోగ్య సమస్యలకు మెరుగైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్లినిక్లకు ఆదరణ విశేషంగా ఉన్నదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య మహిళ క్లినిక్ను కలెక్టర్, డీఎంహెచ్వో చందునాయక్తో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా దవాఖానను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ శిరీష, సిబ్బందితో మాట్లాడి పలు వివరాలు తెలుసుకొన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటగా ఆరు ఆరోగ్య మహిళ క్లినిక్లను మహిళా దినోత్సవాన ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు రెండు వేల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేశారన్నారు. జిల్లాలో 8 ఆరోగ్య మహిళ క్లినిక్లను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. వెల్దుర్తి మహిళా క్లినిక్కు మహిళలు భారీగా వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని, క్లినిక్ నిర్వహణ బాగుందంటూ అభినందించారు. దవాఖాన మరమ్మతుల వివరాలు మాజీ జడ్పీటీసీ ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వెల్దుర్తి మండలంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, ఏపీఎం శంకరయ్యలను ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు కల్పించనున్నామన్నారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్వోలు అరుణశ్రీ, విజయనిర్మల, ఎంసీహెచ్ మెడికల్ ఆఫీసర్ రామ్మోహన్, డాక్టర్ శిరీష, సిబ్బంది ఉన్నారు.