నర్సాపూర్/ శివ్వంపేట, మే 21: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో నిమగ్నమవ్వాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం శివ్వంపేటలోని వెంకటరమణ రైస్ మిల్లు, పీఏసీఎస్ కేంద్రాన్ని, గోమారంలో నటరాజ్ రైస్ మిల్లు, చిన్నగొట్టిముక్లలో ఐకేపీ కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. నర్సాపూర్లోని శివసాయి రైస్మిల్లు, గోదాంగా ఏర్పాటుచేసిన జయకృష్ణ అల్యూమినియం ఫ్యాక్టరీ, మోహన్ అగర్వాల్ షుగర్ ఫ్యాక్టరీల్లో భద్రపరుస్తున్న ధాన్యాన్ని పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఆలస్యానికి తావు లేకుండా చూడాలన్నారు. అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారన్నారు. మిల్లర్లు కూడా వచ్చిన ధాన్యాన్ని త్వరత్వరగా దించుకుని లారీలను వెంటనే పంపిస్తే తిరిగి ధాన్యం లోడ్ చేసి పంపడానికి వీలుంటుందన్నారు.
ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుంది
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, సంయమనం పాటించాలని, ఎఫ్ఏక్యూ ప్రమాణాల మేరకు తేమ, తాళ్లు లేకుండా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. గన్నీ సంచుల కొరత లేదని, లారీలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తహసీల్దార్, రవాణాధికారి, పోలీసుల సమష్టి సహకారంతో వాహనాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశించామన్నారు. కొనుగోలు కేంద్రాలు, వే బ్రిడ్జ్ కాంటాల్లో తూకంలో ఎటువంటి తేడాలు గమనించినా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 9885915768, 08452-223360 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ధాన్యం వచ్చిన వెంటనే తూకం వేసి ట్యాగింగ్ చేసి మిల్లులకు తరలించాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు.
వానకాలం సమీపిస్తున్నందున పక్షం రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగించేందుకు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశామన్నారు. ఆదివారం జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మిల్లర్లు సీరియల్ ప్రకారం లారీల్లో వచ్చిన ధాన్యంతో పాటు ట్రాక్టర్, డీసీఎం వంటి వాహనాల్లో వచ్చే ధాన్యాన్ని కూడా 24 గంటల్లో అన్ లోడింగ్ చేసుకోవాలన్నారు. తద్వారా కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. ధాన్యంలో కోత విధించకుండా ట్రక్ షీట్ జారీ చేయాలని మిల్లర్లకు స్పష్టం చేశారు. భారత ఆహార సంస్థకు పెండింగు ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ను అందించేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున, రైస్ మిల్లర్లు రోజు వారి లక్ష్యం మేరకు సనత్నగర్లోని ఎఫ్సీఐకి ధాన్యం తరలించాలన్నారు. కలెక్టర్ వెంట నర్సాపూర్లో కలెక్టర్ వెంట నర్సాపూర్ మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, తహసీల్దార్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, తహసీల్దార్ శ్రీనివాస్చారి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి ఉన్నారు.