స్వరాష్ట్రంలో మెదక్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుండడంతో ప్రజలకు మౌలిక వసతులు సమకూరుతున్నాయి. సమైక్య రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చాక మెదక్ జిల్లా అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. ఇదే కోవలో నేడు మెదక్ జిల్లాకేంద్రంలో రూ.262 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మెదక్లో రూ.180 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మెదక్ మున్సిపాలిటీలో సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ.50 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. రూ.7.80 కోట్లతో మెదక్లోని దాయర రోడ్డు పనులను ప్రారంభిస్తారు. అర్బన్ పీహెచ్సీ రూ.1.43 కోట్లు, రూ.50 లక్షలతో నిర్మించిన సఖీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. వెల్కం బోర్డు చౌరస్తా నుంచి మెదక్ చర్చి ప్రాంగణం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తారు. మెదక్ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగిస్తారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
మెదక్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : వైద్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో స్థాయిని పెంచడంతో పాటు మాతా శిశు సంరక్షణ కేంద్రా లు, పల్లె, బస్తీ దవాఖానలు, డయాలసిస్ సెంటర్లు, డయోగ్నోస్టిక్ హబ్లు, ఐసీయూలతో అందరికీ ఉచితంగా అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారు. రూ.180 కోట్లతో చేపట్టనున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో త్వరలోనే వంద ఎంబీబీఎస్ సీట్ల సామర్ధ్యంతో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానుండడంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంజూరు చేయడంతో పాటు పరిపాలన అనుమతులు ఇచ్చి రూ.180 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటాల్ సమీపంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం పక్కన మెడికల్ కాలేజీ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.180 కోట్లతో మెడికల్ కాలేజీకి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన అన్ని రకాల మౌలిక వసతులను టీఎస్ఎంఐడీసీ కల్పిస్తున్నది. ఈ నిధులతో 400 పడకల సామర్ధ్యంతో దవాఖాన నిర్మాణంతో పాటు ల్యాబ్లు, సెమినార్ హాళ్లు, అనుబంధ దవాఖాన భవనాలు, హాస్టల్ భవన నిర్మాణం ఇతర వసతులను కల్పించనున్నారు.
ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది, మందులు, సౌకర్యాలు, యంత్ర పరికరాలు ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు, పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో వసతులను, వైద్యులను నియమించి మెరుగైన వైద్య సేవలందిస్తున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా వైద్యసేవలు అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మెదక్ జిల్లా కేంద్రంలో 200 పడకల దవాఖాన ఉండగా, మరో 50 పడకల దవాఖానను నిర్మించనున్నారు. మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 150 పడకలు ఉండగా, క్రిటికల్ కేర్లో మరో 100 పడకల దవాఖాన ఉండాలి. జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు, పరికరాలతో పాటు మందులను అందుబాటులో ఉంచుతోంది. కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుతున్నాయి. ప్రతినెలా 370 వరకు కాన్పులు జరుగుతున్నారు. నవజాత శిశువుల కోసం ఎస్ఎన్సీయూ వార్డు ఏర్పాటు చేశారు. ఇందులో ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు అందబాటులో ఉన్నాయి. మెదక్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు నూతనంగా గర్భిణుల వ్యయ ప్రయాసలకు ఊరట కల్పించేందుకు టిఫ్ఫా స్కానింగ్ యంత్రం ఎంసీహెచ్లో ఏర్పాటు చేయడంతో గర్భిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే కార్పొరేట్ స్థాయిలో అన్నివర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో సర్కారు దవాఖానల్లో అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యసేవలు అందిస్తున్నాం. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ మెదక్కు మెడికల్ కాలేజీ మంజూరు చేసి దాని నిర్మాణానికి రూ.180 కోట్లు కేటాయించారు. ఈ ప్రాంత విద్యార్థులు ఒకప్పుడు ఎంబీబీఎస్ చదవాలంటే వేరే జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా.
-ఎం.పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
మెదక్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం పర్యటించనున్నట్టు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. సుమారు రూ.262 కోట్లతో అభివృద్ధి, శంకుస్థాపనలు చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మెదక్కు మెడికల్ కళాశాల మంజూరు చేసి, దాని నిర్మాణానికి రూ.180 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మంత్రి హరీశ్రావు మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మెదక్ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ.50 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.2.50 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మెదక్ పట్టణంలోని దాయర రోడ్డుకు రూ.7.80 కోట్లతో పనులను ప్రారంభిస్తారన్నారు. అర్బన్ పీహెచ్సీకి రూ.1.43 కోట్లు, రూ.50 లక్షలతో సఖీ కేం ద్రాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. అనంతరం వెల్కం బోర్డు చౌరస్తా నుంచి మెదక్ చర్చి ప్రాంగణం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మెదక్ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.