మెదక్ జిల్లాకేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కాపూర్ తండా అభివృద్ధి వైపు పయనిస్తున్నది. గతంలో రాయినిపల్లికి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న మల్కాపూర్ తండా, 2018 ఆగస్టులో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో 426 జనాభా, 96 కుటుంబాలు ఉన్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ తండాకు సరైన దారి కూడా ఉండక పోయేది. పల్లెప్రగతి కార్యక్రమంతో మల్కాపూర్ తండా రూపురేఖలను మార్చింది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ తండా నీటి వసతి లేక అల్లాడింది. అనేక సమస్యలతో సతమతమయ్యింది. తెలంగాణ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. మూడేండ్ల కింద కొత్త గ్రామపంచాయతీగా ఆవిర్భవించి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నది.
తండా రూపురేఖలు మార్చిన పల్లెప్రగతి…
పల్లెప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులు, హరితహారం మొక్కల పెంపకం, విద్యుత్ సమస్యల పరిష్కారం, పాడుబడిన బావుల పూడ్చివేత వంటి పనులు చేపట్టారు. గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు తండాకు మరింత శోభను తెచ్చాయి. రోడ్ల వెంబడి నాటిన తీరొక్క రకం మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. తడి, పొడి చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికీ బుట్టలు పంపిణీ చేశారు. నిత్యం జీపీ సిబ్బంది తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి తండాను శుభ్రంగా ఉంచుతున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తుండడంతో వ్యాధులు దూరమవుతున్నాయి. గ్రామంలో డంపింగ్యార్డు పూర్తి కాగా, వైకుంఠధామం నిర్మాణం చివరి దశలో ఉంది. తండాలో రూ.5 లక్షలతో సీసీరోడ్లు వేస్తున్నారు.
గ్రామం భౌగోళిక స్వరూపం..
మల్కాపూర్ తండాలో 640 జనాభా ఉంది. ఇందులో 279 మంది ఓటర్లు ఉన్నారు. నివాస గృహలు 96 ఉండగా, 7 వార్డులు ఉన్నాయి. సామాజిక పింఛన్దారులు 50 మంది ఉన్నారు. ఒక అంగన్డీ కేంద్రం, 2 మిషన్ భగీరథ ట్యాంక్లు, ఒక ప్రాథమిక పాఠశాల, 4 పశువుల తొట్లు, పంచాయతీ సిబ్బంది 2 ఉన్నారు. పశువుల షెడ్ ఒకటి, ఉపాధిహామీ కూలీలు 150 మంది ఉన్నారు. రూ.2.49లక్షలతో డంపింగ్యార్డు, రూ.12లక్షలతో వైకుంఠ ధామ నిర్మాణం చేపట్టారు. రూ.5 లక్షలతో ట్రాక్టర్, ట్యాంకర్, రూ.5 లక్షలతో సీసీరోడ్లు నిర్మించారు.
గ్రామానికి హరితశోభ..
గ్రామంలో హరితహారంలో ఇప్పటి వరకు 3245 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. మొక్కలకు నిత్యం వాటర్ పడుతున్నారు. నర్సరీలో 17వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వేసవిలో మొక్కలు ఎండవేడిమి నుంచి తట్టుకునేందుకు గ్రీన్నెట్ ఏర్పాటు చేశారు. రూ.1.21లక్షలతో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో తండావాసులకు ఆహ్లాదకరంగా మారింది. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో గ్రామంలో 2 మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించారు. 126 నల్లా కనెక్షన్లు ఇచ్చి భగీరథ నీరు ఇంటింటికీ అందిస్తుండడంతో నీటి కష్టాలు తీరాయి.
ఇవీ కూడా చదవండి…
రేపు ఉగాది, శ్రీరామ నవరాత్రులు ప్రారంభం కొత్త వసంతం!
పరమానందానికి … శ్రీం గోవిందాయ నమః