కాలగణనకు ప్రాతిపదికగా ‘ఉగాది‘ని చెబుతాం. ‘ఉగ‘ అంటే ‘నక్షత్ర గమనం’. దానికి ఆది (మొదలు)యే ఉగాది. ఉత్తర దక్షిణాయనాలకు ప్రతీక యుగం. ఈ రెంటినీ కలిపి యుగం (జంట) అంటాం. ఆ యుగానికీ ఆది ఉగాదినే.
కాలం ఆద్యం, అనంతమైన పరబ్రహ్మ స్వరూపం. సృష్టి సమస్తమూ శూన్యం నుండే వస్తుంది. మళ్ళీ అందులోనే లయమవుతుంది. పదార్థం (దృశ్యమాన ప్రపంచం) ఉన్నచోటే కాలభావన ఉంటుంది. పదార్థానుభవం కోసమే కాలభావన వచ్చింది. జీవుల పుట్టుకనుండి మరణం వరకు అంతా అనుభవమే కాబట్టి, కాలానికి ఈ ప్రత్యేకత. కాలమనే మహాప్రవాహంలో ఎన్ని యుగాలు, ఉగాదులు వచ్చాయో ఎవరూ గణింపలేరు. ఆ కాల కరాళ దంష్ట్రలలో చిక్కి లయమైన విశ్వ సంచయం ఎంతోకూడా మన అంచనాకు అందదు.
కాలమేదైనా దాని గణన ఉషోదయం తోటే. దానిని పగలుగా, సూర్యాస్తమయాన్ని రాత్రిగా రెంటినీ కలిపి రోజుగా, ఏడాదికి ఆరు ఋతువులుగా గణిస్తున్నాం. పురాణాలను అనుసరించి బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించిన రోజునే ఉగాది అంటాం. కాలగణనకు మనం పంచాంగాలను వాడుతున్నాం. పంచాంగ కర్తలు సాధారణంగా ప్రాచ్య, దృగ్గణితాల (రెండు మార్గాలు)ను అనుసరిస్తారు. ‘రామాయణ’ కావ్యం ప్రకారం నిజానికి చైత్రమాసం సంవత్సరంలో చివరి నెల. ఆ చైత్రంలో శుద్ధ నవమినాడు ‘శ్రీరామ జననం’ జరిగినట్లు ఉంది. ఈ పద్ధతిలో వైశాఖం సంవత్సరానికి ఆదిగా వస్తుంది. వివిధ గతులలో ఋషులు తాము దర్శించిన కాలగణననుబట్టి ఉగాదులను నిర్ణయించినా, వసంతాగమనాన్ని స్వాగతించే చైత్రమాసాన్నే చాలాకాలంగా ‘ఉగాది’గా పాటిస్తున్నాం.
చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని,శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి
హేమాద్రి పండితుని నిర్ణయం ప్రకారం సృష్టి జరిగింది చైత్ర పాడ్యమినాడు. పెద్దల నిర్ణయానుసారమూ దానినే ఉగాదిగా పరిగణిస్తున్నాం. మన తెలుగువారేకాక వివిధ ప్రాంతాల ప్రజలూ పలు పేర్లతో ఉగాదిని జరుపుకొంటారు. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆనందంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది మనకు అందిస్తుంది. ప్రకృతి శిశిరంలో (మాఘ-ఫాల్గుణాలు) ఆకులు రాలుస్తుంది. వసంతాగమనం (చైత్రం)లో చెట్లు మళ్ళీ చిగురిస్తాయి. కోయిలలు కొత్త కాలానికి పరవశించి కుహుకుహూ రాగాలను ఆలపిస్తాయి. కవులు తమ కవితలతో ఉగాదిని ఘనంగా స్వాగతిస్తారు. ప్రజలూ ఆనందంతో శోభాయమానంగా పల్లవించే ప్రాకృతిక రమణీయతను ఉత్సవంగా ఆస్వాదిస్తారు. ఇండ్లకు మామిడి తోరణాలు కట్టి, కుటుంబ సభ్యులంతా కొత్త వస్ర్తాలు ధరించి బంధుమిత్రులను ఆహ్వానించి, అట్టహాసంగా ఉగాదిని జరుపుకోవడం ఆచారమైంది.
సాధారణంగా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడితో దినచర్యను ఆరంభించడం ఆనవాయితీ. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు.. ఆరు రుచులూ కలిసిన ఉగాది పచ్చడి మంచి చెడు, సుఖదుఃఖాలకు ప్రతీక. మానవ జీవితం ఎన్నో ఒడుదొడుకుల మధ్య సాగుతుంది. వీటిని సంయమనంతో స్వీకరించి, జీవిత పరమార్థాన్ని సాధించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి అందిస్తుంది. కరోనా మళ్లీ విజృంభిస్తున్న ఈవేళ సకల జాగ్రత్తలతో కొత్త వసంతానికి స్వాగతం చెబుదాం.
పాలకుర్తి ,రామమూర్తి