‘సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠ ప్రాంగణ రింఖణలోల మనాయాసం పరమాయాసమ్
మాయా కల్పిత నానాకార మనాకారం భువనాకారమ్
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్.’
గాం భూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః భూమినిగాని, గోవునుగాని, స్వర్గాన్నిగాని, వేదాన్నిగాని పొందెడువాడు గోవిందుడు. గాః విందతీతి గోవిందః ఆవులను పొందినవాడు, వాక్కులను పొందినవాడు కనుక గోవిందుడు. గోవింద శబ్దం ఆవులను ఏలువానికి, శ్రీకృష్ణునికి, బృహస్పతికి కూడా పేర్లుగా చెప్పబడినాయి. గోశబ్దానికి అనేక అర్థాలున్నాయి. ఇంద్రియాలకు సంతృప్తినిచ్చేవాడు కూడా గోవిందుడే. ఇంద్రియాలకు సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది? మనసు ప్రశాంతమైనప్పుడు! కాబట్టి, తనను తలచుకోవడం ద్వారా మన మనస్సుకు సంతృప్తిని, పరమానంద స్థితిని ఇచ్చేవాడు గోవిందుడు. కనిపించే సంపదల నుండి కనిపించని జ్ఞానసంపదల వరకు అన్నిటినీ పొందే అవకాశాన్ని కలిగించడమే గోవిందుని లక్షణం. అందువల్లే ఎవరి స్థాయిలో, వారివారి కోరికలకు రూపాన్నిచ్చేవాడాయన. నిత్యజీవితంలో ఆహార సముపార్జన నుంచి అనేక వ్యవహారాల నిర్వహణ, చివరకు అన్నిటిలోనూ తగిన జ్ఞాన సముపార్జనపై దృష్టి పెట్టేవారందరికీ ‘గోవింద నామ స్మరణ’ తప్పనిసరి.
గోవిందుడు అన్ని వర్గాలకు, స్థాయిలకు చెందిన అందరివాడు.
లోకంలో ఏదైనా అంశం తమ శరీరాలకు సంతృప్తినిస్తే దానిని ‘సుఖం’ అంటాం. మనస్సుకు సంతృప్తినిస్తే అది ‘సంతోషం’. అదే విధంగా ఆత్మకు కలిగేది ‘ఆనందం’. ఈ మూడు స్థాయిల్లోనూ
క్రమ పరిణామానికి మనం పట్టుకోవలసిన మంత్రదండం ‘శ్రీం గోవిందాయ నమః’. లక్ష్మీ బీజంతో కూడిన విష్ణువుగా పూజించడం వల్ల ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాలన్నీ మనకు లభిస్తాయి. కనిపించని జ్ఞానమూ మనకు చేకూరుతుంది. విష్ణు దేవాలయాలలో నిత్యమూ ‘గోవిందా… గోవింద’ అంటూ నామస్మరణలు, భజనలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ నామాన్ని అతి తీవ్రంగా
జపిస్తే ఇహపర సౌఖ్యాలు ఇక మనవే.
సాగి ,కమలాకరశర్మ