హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిల చెల్లింపులో కొనసాగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎంత మందికి బకాయిలు చెల్లించారో, ఇంకా ఎంతమంది ఉద్యోగులు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారో చెప్పాలని, వారికి జారీచేసిన టోకెన్ నంబర్ల వివరాలతోపాటు పూర్తి సమాచారాన్ని 2 వారాల్లోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. హెడ్ మాస్టర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, సూల్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు తదితర హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన 764 మందికిపైగా ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై గతంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు హాజరై.. బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
కానీ, ఆ హామీ ప్రకారం చెల్లింపులు జరుగలేదని ఆరోపిస్తూ 50 కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించారో, ఇంకా ఎంతమంది ఎదురు చూస్తున్నారో, వారికి జారీచేసిన టోకెన్ల స్థితి ఏమిటో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.