కలబురగి, జూన్ 10: తెలంగాణలోనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఎరువుల కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుకాణాల ముందు భారీ క్యూలలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఖరీఫ్ నాట్ల కు ముందు రైతులందరికీ తగినంత డీఏపీ ఎరువులను సరఫరా చేయాలని డిమాండు చేస్తూ, కృత్రిమ కొరత ద్వారా ఎరువుల ధరలను పెంచే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రాంత రైతు సంఘ(కేపీఆర్ఎస్) వేదికగా రైతులు కలబురిగిలోని తాలూకా వ్యవసాయ ఉత్పత్తి సహకార మార్కెటింగ్ సొసైటీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్ ఖర్గేని ఉద్దేశించిన వినతి పత్రాన్ని నిరసనకారులు ప్రాంతీయ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, వ్యవసాయ సంయుక్త డైరెక్టర్ ద్వారా అందచేశారు.
కేపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శరణ్బసప్ప మాంషెట్టి ప్రదర్శనలో మాట్లాడుతూ ఎరువుల కొరత సహజంగా జరగడం లేదని, వ్యాపారులు, ఏజెంట్లు కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారని అన్నారు. గత రెండు రోజులుగా రైతులు ఆధార్ కార్డులు చేతిలో పట్టుకుని దుకాణాల ముందు బారులుతీరి నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని, అయినప్పటికీ రైతుకు కేవలం రెండు బస్తాల డీఏపీ మాత్రమే అందచేస్తున్నారని ఆయన చెప్పారు. ఇది రైతులను వేధించడమేనని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నాట్ల సీజన్ ముగియకముందే ప్రతి రైతుకు అవసరమైనంత డీఏపీ ఎరువును సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే అది ఖరీఫ్ పంటపై తీవ్ర ప్రభావం చూపి రైతులను అప్పు ఊబిలోకి నెడుతుందని ఆయన హెచ్చరించారు. అక్రమ నిల్వదారులు, బ్లాక్ మార్కెట్ నిర్వాహకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మాంషెట్టి డిమాండ్ చేశారు.