మెదక్, ఏప్రిల్ 1 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని, అందుకు అధికారులు టీం వర్క్తో పని చేయాలని అదనపు కలెక్టర్ జి.రమేశ్ ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, సహకార అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ యాసంగిలో 4.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ, మార్కెటింగ్ శాఖల ద్వారా సుమారు 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే వస్తుందని, ఈనెల 10 వరకు కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు. ప్రధానంగా పాపన్నపేట, హవేళీఘనపూర్, మెదక్ తదితర మండలాల నుంచి ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులు యంత్రాల ద్వారా ధాన్యం కోసి కల్లాల దగ్గరే శుద్ధి చేసి తాలు లేకుండా 17 శాతం తేమ మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
ఈ విషయమై అధికారులు, ఐకేపీ మహిళా సంఘాలు రైతులకు అవగాహన కల్పించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని వివరించారు. కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డీవోలు పర్యవేక్షించాలన్నారు. ప్రతి మండలంలో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, టీం వర్క్తో పని చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం తేమను కొలిచే యంత్రాలు, ధాన్యం శుద్ధి చేసే యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేసి జియో ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని, ఇందుకు అవసరమైన వాహనాలు, హమాలీలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. రైతులకు ధాన్యం సేకరించిన 72 గంటల్లో పేమెంట్ చేయాలని సూచించారు. సరిహద్దు రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా పోలీసులు నిఘా పెట్టాలని, చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ కృష్ణమూర్తి, ఆర్డీవో సాయిరాం, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి అధికారి పరశుంరాంనాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్, జిల్లా సహకార అధికారి, రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
కరోనా రోగిని చేర్చుకునేందుకు ఆసుపత్రుల నిరాకరణ.. నిరసనతో మృతి
121 ఏండ్ల నాటి చాక్లెట్.. అటక మీద దొరికిందోచ్..!