హుస్నాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీజేపీ ప్రజాహిత యాత్రలు చేపట్టిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డులో హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన, వ్యవసాయ మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధితోపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంపీ బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశాడో చెప్పిన తర్వాతే యాత్రలకు రావాలని డిమాండ్ చేశారు. ఐదేండ్లపాటు నియోజకవర్గాన్ని పట్టించుకోని సంజయ్ హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి మళ్లీ ప్రజలను మభ్యపెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు బండికి లేదన్నారు. గ్యాస్ పై ప్రభుత్వం ఇస్తున్న రూ.500 సబ్సిడీని కేంద్రం నుంచి ఇప్పించే దమ్ము బండి సంజయ్కి ఉందా అని ప్రశ్నించారు.
బండి సంజయ్ హుస్నాబాద్కు ఏం చేశాడో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గానీ, మల్లెచెట్టు చౌరస్తాలో గానీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు ఆయన సిద్ధం గా ఉంటాడా అనేది చెప్పాలన్నారు. రాముడి మందిరం, అక్షింతలు అంటూ ఓట్లు అడగడం అప్రజాస్వామికమన్నారు. అధికారంలోకి వచ్చిన 48గంటల్లోపే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేన్నారు. మరో రెండు గ్యారెంటీలను చేవెళ్లలో జరిగే సభలో ప్రియాంకగాంధీ చేతు ల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూ నిట్ల ఉచిత విద్యుత్ పథకాలకు మంగళవారం శ్రీకారం చుడుతామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభించిన పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్ పర్సన్ అయిలేని అనితారెడ్డి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు, మార్కెటింగ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ అనంతరం జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా వేతనాలు తదితర అవసరాలకు నిధులు ఖర్చు చేసుకోవాలని సూచించారు. కౌన్సిల్లో తీర్మానం చేసుకొని నీటి బిల్లులు, ఇండ్ల అనుమతుల ఫీజులు, ఇతర పన్నులు వసూలు చేసుకోవాలన్నారు. ఇండ్ల అనుమతుల్లో కటాఫ్ డేట్ విషయంపై సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం వానకాలంలో వరద నీటితో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి వరద పట్టణంలోకి రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినైట్లెతే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం, హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ భవనాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని, త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్ పర్సన్ అయిలేని అనితారెడ్డి, కమిషనర్ మలికార్జున్గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.