కాలానుగుణంగా వ్యవసాయ విధానాలు మారుతున్నాయి. సాంప్రదాయ సేద్యాన్ని వీడి ఆధునికతను అందిపుచ్చుకుంటున్న రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మెట్ట పంట పొలాల్లో కలుపు నివారణ కోసం మల్చింగ్ షీట్లు వేయడంతో పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు తెగుళ్లు, పురుగుల బెడద తీరి తక్కువ నీటితో ఎక్కువ పంట చేతికి వస్తున్నది. ప్రోత్సాహకంగా ప్రభుత్వం 50శాతం సబ్సిడీ కూడా అందిస్తుండడంతో రైతాంగం మల్చింగ్ విధానం అవలంబించేందుకు ఆసక్తి చూపుతున్నది.
సదాశివపేట, డిసెంబర్ 11: ఒకప్పుడు వ్యవసాయం అంటేనే పాడిపంటగా పిలిచేది. ఇప్పుడు అందులోంచి పాడి పూర్తిగా కనుమరుగైపోతున్నది. యాంత్రీకరణతో అన్నదాత నుంచి హలం దూరమైంది. పూర్తిగా యంత్రాలతోనే వ్యవసాయం ముందుకెళ్తుంది. ఈ క్రమంలో మెట్ట పంటలలో కలుపు మొక్కల నివారణకు గతంలో ఎడ్లతో చేలల్లో అరకలు తోలుకునేవారు. తర్వాత కూలీలతో మొక్కల మిగిలిన గడ్డిని తీసేవారు. ఇప్పుడు దాని స్థానంలో మల్చింగ్ షీట్ పరిచే పద్ధ్దతి వచ్చింది. దీని ప్రయోజనాలు తెలుసుకున్న కొందరు రైతులు ఈ మల్చింగ్ విధానానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి తెలంగాణ సర్కారు తోడ్పాటును అందిస్తుండడంతో రైతులు మల్చింగ్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మల్చింగ్తో బహుళ ప్రయోజనాలు..
మెట్ట పంటల్లో మల్చింగ్ షీట్లు వేయడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. నీరు ఆదా నుంచి మొదలు చీడపీడల నిర్మూలన వరకు అనేక రకాలుగా రైతులకు లాభం చేకూరుతుంది. మెట్ట పంటల్లో మల్చింగ్ వేయడంతో కలుపు 90శాతం వరకు నివారించవచ్చు. షీట్ కింద గడ్డి మొలిచినప్పటికీ సూర్య కిరణాలు పడక కిరణజన్య సంయోగ క్రియ నిలిచిపోయి మొక్క షీట్ కిందనే మగ్గిపోతుంది. డ్రిప్తో సాగునీరు 50శాతం ఆదా అవుతుంది. మల్చింగ్ షీట్పై పడే సూర్యకిరణాలతో డిఫెక్ట్ అయి కొన్నిరకాల పురుగులు కంట్రోల్లో ఉంటాయి. భూమిలో తేమ శాతం ఎక్కువ రోజులు ఉంటుంది. ఎరువులు నేరుగా కాకుండా డ్రిప్ ద్వారా వేస్తాం కాబట్టి వేసిన ఎరువులు సక్రమంగా వినియోగం అవుతాయి. భారీ వర్షాలు పడినప్పుడు మొక్కలు నీరు పట్టిపోయి చనిపోకుండా నివారించవచ్చు. పంటలో దిగుబడి సైతం భారీగా పెరుగుతుంది. మల్చింగ్ విధానం వచ్చిన ప్రారంభ దశలో వరిపొట్టు, రంపపుపొట్టు, ఎండిన ఆకులు, ఎండుగడ్డి, కొబ్బరిపీచు, చెరుకు పిప్పి లాంటి వ్యర్థాలతో మల్చింగ్ చేసేవారు. క్రమంగా వీటి లభ్యత తగ్గిపోవడంతో ప్లాస్టింగ్ మల్చింగ్ వచ్చింది. వర్షాలతో భూమికోతకు గురికాకుండా ఉంటుంది. విత్తనాలు కూడా కొంతమేరకు ఆదా అవుతాయి. పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది.
మల్చింగ్ వేసే పద్ధతులు ఇలా…
మెట్ట పంటల్లో కలుపు నివారణ కోసం వేసే ప్లాస్టింగ్ మల్చింగ్తో అనేక లాభాలున్నాయి. రకరకాల రంగులు ఉంటాయి. మనం వేసుకునే పంటలను బట్టి మల్చింగ్ షీట్లను ఎంచుకోవాలి. ఇవి 7 నుంచి మొదలు 200 మైక్రాన్ల వరకు అందుబాటులో ఉంటాయి. 1.5 నుంచి 4ఫీట్ల వెడల్పులో ఉంటాయి. ట్రాక్టర్తో ముందుగా బోదెలు వేసుకుని ఆ తర్వాత డ్రిప్ పైప్ను పరిచి దానిపై ఎక్కువగా వేడి వాతావరణం లేని సమయంలో మల్చింగ్ షీట్లను వేసుకోవాలి. గాలికి సీజ్ చేయకుండా ఇరువైపులా మట్టిని ఎగబోయాలి. గతంలో రంధ్రాలు లేకుండా వచ్చేవి. ఇప్పుడు పంటలను బట్టి మనకు కావాల్సిన కొలతతో రంధ్రాలు చేసిన షీట్లను పలు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. పంటలను బట్టి మల్చింగ్ పేపర్ వేసుకోవాలి. మన ప్రాంతంలో ఎక్కువగా మిర్చీ పంటకు మల్చింగ్ను వినియోగిస్తున్నారు.
చాలా ప్రయోజనాలు..
మెట్ట పంటలకు మల్చింగ్ వేయడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ ఉండే తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైతులు వ్యవసాయంలో ఎడ్లను వినియోగించడం లేదు. దీంతో కలుపు నివారణ సమస్యగా మారింది. దీనికి మల్చింగ్ విధానం పెద్ద ఎత్తున మేలు చేస్తుంది. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు.
– స్పందన, హార్టికల్చర్ అధికారి సదాశివపేట