రామాయంపేట రూరల్, డిసెంబర్ 14: వానకాలంలో వరి పండించి యాసంగిలో మొక్కజొన్న సాగు చేసే రైతులు జీరో టిల్లేజ్ (దుక్కు దున్నకుండా మక్కసాగు) ద్వారా సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రామాయంపేట మండలంలో ఎంతో మంది రైతులు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయడం వల్ల ఖర్చు తక్కువ కావడంతో పాటు అధిక లాభాలు పొందే అవకాశం ఉన్నది.
జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్క జొన్న సాగు చేసుకోవడానికి నవంబర్, డిసెంబర్ నెలలు అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎకరానికి 8 కిలోల విత్తనం అవసరమవుతుందని, వరి కోసిన తరువాత నేలలో తగినంత తేమ లేనట్లయితే తేలికపాటి తడి ఇచ్చి మొక్కజొన్నను విత్తుకోవాలని సూచిస్తున్నారు. తాడును ఉపయోగించి లేదా విత్తనం వేసే యంత్రంతో వరుసకు వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఈ పద్ధతిలో కలుపు నివారణ అతి ముఖ్యమైనది. విత్తనం విత్తిన తర్వాత 24 గంటల నుంచి 42 గంటల వ్యవధిలో ఎకరానికి కేజీ అట్రాజిన్ 50 శాతం మందు వాడితే కలుపు తగ్గించవచ్చు. ఎకరానికి లీటరు పెరక్వైడ్ మందు 200 లీటర్ల నీటిలో వాడితే వరి కొయ్యలు ఇగురు పెట్టకుండా నివారించొచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఎకరానికి 160-180 కిలోల యూరియా, 50 కిలోల పొటాష్, 50 కిలోల డీఏపీ(దుక్కిమందు) వేసుకోవచ్చు. విత్తనం విత్తేటప్పుడు ఎకరానికి 40కిలోల యూరియా, 60 కిలోల డీఏపీ, 30 కిలోల పొటాష్ వాడాలి. యూరియా విత్తిన 20 నుంచి 25 రోజులు 40 కిలోలు, 25 నుంచి 40 రోజులు చివరగా మిగిలిన యూరియా వేసుకోవాలి. పూత దశలో 25 కిలోల పొటాష్ వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగును నివారించేందుకు మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది.
జీరో టిల్లేజ్ దుక్కిదున్నకుండా మక్క సాగు చేసే పద్ధతి చాలా మంచిది. రైతులకు ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. ఎరువుల వినియోగం చాలా వరకు తగ్గుతుంది. చాలా మంది రైతులకు దీని గురించి అవగాహన లేకపోవడంతో పెట్టుబడులు ఎక్కువ పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జీరో టిల్లేజ్ పట్ల అధికారులు రైతులకు విస్త్రతంగా
అవగాహన కల్పిస్తే బాగుంటుంది.
రైతులు వరి సాగు అనంతరం జీరో టిల్లేజ్ ద్వారా మొక్కజొన్న సాగు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఖర్చు తగ్గించుకుని అధిక ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలువురు రైతులు మండల వ్యాప్తంగా దీనిని అనుసరిస్తున్నారు. భవిష్యత్తులో జీరో టిల్లేజ్ పద్ధతిలో పెద్ద ఎత్తున సాగు చేసేందుకు రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తాం.