మెదక్ మున్సిపాలిటీ/కోహీర్/ వట్పల్లి/ రాయికోడ్, జూలై 5: జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలోని వెంకట్రావ్నగర్, సాయినగర్ కాలానీ, నల్లపోచమ్మ దేవాలయం వెనుక కాలనీల్లో వర్షం నీరు చేరింది. భారీ వర్షం కురియడంతో విత్తిన విత్తనాలు ఎండిపోతాయనుకున్న సమయంలో ఈ వర్షం కొంత మేరకు ఊరటనిచ్చిందని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సరాసరిగా 44.6 మిల్లీమీటర్ల వర్షం కురువగా, మెదక్ పట్టణంతో పాటు మండలంలో 54.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
రాయికోడ్
రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. రైతులు వెసిన పంటలకు జీవం పోసినట్లు అయ్యింది. ధర్మాపూర్ గ్రామ శివారులో ఉన్న బసవేశ్వర్ వాగుపై ఉన్న బ్రిడ్జి వర్షం నీటికి ధ్వంసం అయ్యింది.
కోహీర్
కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, కవేలి, పైడిగుమ్మల్ గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నారింజ వాగులో భారీగా నీరు చేరింది. కవేలి- కోహీర్ మధ్య ఉన్న నారింజ వంతెన సమీపంలో రైతులు సాగు చేస్తున్న పలు రకాల పంటలు నీట మునిగాయి. వర్షాకాలం ప్రారంభమైన నెల తర్వాత భారీ వర్షం కురిసినందుకు రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వట్పల్లి మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కుంటలు, వాగులు నిండుకుండలా మారాయి. సమయానికి వర్షం కురిస్తే పత్తి పంటకు లాభం చేకురుతుందని రైతులు తెలిపారు.