చిలిపిచెడ్, మార్చి 22: కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు పర్చిన సంక్షేమ పథకాలే మెదక్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తాయని బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని శీలాంపల్లిలో బీఆర్ఎస్ నాయకుడి గృహప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటికీ చాలామంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్నా.. ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు చేరలేదని విమర్శించారు. వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీగా గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని క్యాడర్కు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, దుర్గారెడ్డి, సంగాగౌడ్, విఠల్, ముకుందరెడ్డి, శంకరయ్య, భీమయ్య, రాజేందర్రెడ్డి, వీరాస్వామి, విఠల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిలిపిచెడ్, మార్చి 22: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి అన్నారు. వెంకట్రామిరెడ్డికి టికెట్ కేటాయించినందుకు బీఆర్ఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడు కేసీఆర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తల కృషితో మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.