దుబ్బాక, మార్చి 23: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగు నీళ్లు విడుదల చేసిన ఘనత దక్కితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ఉప కాల్వలు నిర్మించుకోలేని దుస్థితి నెలకొన్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఉప కాల్వలు నిర్మించకపోవడంతో రైతులకు సాగునీటి గోస ఏర్పడిందన్నారు.
వెంటనే ఉప కాల్వలు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ద్వారా సాగునీళ్లు అందుతాయన్నారు. ప్రధాన కాల్వలు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీటి సమస్య ఏర్పడుతున్నదన్నారు. బీఆర్ఎస్ హయాంలో పలు గ్రామాల్లో ఉప కాల్వల కోసం భూసేకరణ చేసినప్పటికీ, తక్కువ నష్ట పరిహారం ఉండడంతో రైతులు అంగీకరించ పోవడంతో నష్ట పరిహారం డబ్బులు కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి పెరిగిన రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వారికి నష్ట పరిహారాన్ని అందిస్తే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తారన్నారు.
కోర్టు కేసులు, భూసేకరణ, నష్ట పరిహారం సమస్యలను త్వరగా పరిష్కరించి ఉప కాల్వలు నిర్మించాలని కోరారు. ఇర్కోడ్ ఎత్తిపోతల పథకానికి నిధులున్నా పనులు పూర్తి చేయకపోవడంతో 21 గ్రామాల రైతులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. ఈ విషయంపై వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చొరవ చూపాలని కోరారు. కాలువల్లో పూడికతీత కోసం నిధులు మంజూరు చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను పునరుద్ధరించినట్లు తెలిపారు. కొన్నేండ్లుగా చదువుకుంటలో పునరుద్ధరణ పనులు జరుగకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోయాయన్నారు. నిధులు మంజూరు చేసి చెరువు, కుంటలను బాగు చేయాలని కోరారు.