కాంగ్రెస్ పాలనలో సామాన్యుల భూమి మొదలుకొని దేవుడి మాన్యానికి రక్షణ లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ 131 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిని స్వామి వారి పేరిట రికార్డుల్లోకి ఎక్కించడంతో పాటు ఏ గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉందో రికార్డుల్లో వెల్లడించారు. కోట్లాది రూపాయల విలువైన మల్లన్న దేవుడి భూమిని కాంగ్రెస్ సర్కారు వచ్చిన అనంతరం అక్రమించుకునేందుకు పలువురు యత్నిస్తున్నారు.
చేర్యాల, ఫిబ్రవరి 28: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శివారులోని 438(1) సర్వే నెంబర్లో 7 ఎకరాల మల్లన్న ఆలయ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు.స్వామి వారి భూముల్లో మట్టిని సైతం తవ్వి టిప్పర్లలో తరలించుకుపోయారు.స్వామి వారికి కొమురవెల్లిలో 76.28 ఎకరాలు, కిష్టంపేటలో 27.16 ఎకరాలు, రాంసాగర్లో 11.01 ఎకరాలు, గౌరాయపల్లిలో 6 ఎకరాలు, చేర్యాల మండలంలోని వేచరేణిలో 10.04 ఎకరాల భూమిని బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ మల్లన్న క్షేత్రంలో జరిగిన కల్యాణోత్సవానికి హాజరై కేటాయించారు.
కేసీఆర్ ప్రకటించిన విధంగా భూమిని సైతం 2015లో పహాణీల్లో స్వామి వారి పేరిట నమోదు చేశారు. కానీ, అధికారులు నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేని తనంతో భూములకు హద్దులు నిర్ధారించలేదు. దీంతో విలువైన దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది.ఇప్పటికే స్వామి వారికి కేటాయించిన భూముల్లో కేజీబీవీ భవన నిర్మాణం, పోలీస్స్టేషన్ తదితర వాటిని నిర్మించారు. రాజీవ్ రహదారి సమీపంలోని మల్లన్న భూముల్లోకి పక్కనే ఉన్న మరో వ్యక్తి తన భూమి అంటూ కడీలు పాతడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.దేవుడి భూమిని తన భూమి అంటూ ప్రైవేటు వ్యక్తులు ఏకంగా కడీలు పాతడంతో ఆలయ భూముల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు …
కొమురవెల్లి మల్లికార్జున స్వామి భూమిని సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి అక్రమించాడని, ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్ ఐదు రోజుల క్రితం కొమురవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కొమురవెల్లి ఎస్సై మహేశ్ ఆలయ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకు ఆలయ భూమిలోకి చొచ్చుకు వచ్చి ఆక్రమణ చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేశారు. కబ్జాకు గురైనట్లుగా గుర్తించిన భూమిని ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పరిశీలించారు. కేసు నమోదు విషయమై ఎస్సై మహేశ్ను వివరణ కోరగా, కొమురవెల్లి ఆలయ డీసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆలయానికి సంబంధించిన భూమిలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను సైతం పలువురు తొలిగించారు. ఆలయ భూమిని పరిరక్షించాలని కోరుతూ ఆలయ డిప్యూటీ కమిషనర్తో పాటు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఇటీవల కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు.