చేర్యాల, ఫిబ్రవరి 3: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో నేడు మూడో ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. పట్నం, లష్కర్ ఆదివారాల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకోనున్నారు. పట్నం వారానికి సుమారు 50వేల మంది భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు మల్లన్నను దర్శించుకోవడంతో పాటు పట్నం వేసి బోనం సమర్పించుకోనున్నారు. మహామండపం, గంగరేగుచెట్టు ఆవరణతో పాటు తాము బస చేసిన గదుల వద్ద పట్నాలు వేయనున్నారు. మరికొందరు భక్తులు మల్లన్నగుట్టపైన ఎల్లమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. మల్లన్న క్షేత్రంలో మొక్కుల అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు తరలివెళ్లనున్నారు. స్వామివారి క్షేత్రానికి తరలివచ్చే భక్తుల కోసం ఆలయ ఈవో ఎ.బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.