సమ్మర్ క్యాంపునకు విశేషస్పందన
సిద్దిపేట జిల్లాలో 13 కేంద్రాల్లో క్రీడల నిర్వహణ
ఉత్సాహంగా హాజరవుతున్న చిన్నారులు
గజ్వేల్ రూరల్, మే 15 : గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో ఈ నెల ఒకటి నుంచి సమ్మర్క్యాంపులను ప్రారంభించుకోగా, ఈ నెల చివరి వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమ్మర్క్యాంపు క్రీడలకు జిల్లాలో విశేషస్పందన లభిస్తుంది. ఎప్పటికప్పుడు క్యాంపును జిల్లా యువజన క్రీడలశాఖాధికారి నాగేందర్ పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో 13 కేంద్రాల్లో క్రీడలను ప్రారంభించగా, అందులో గజ్వేల్, సిద్దిపేట పట్టణాల్లో రెండు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో మిగతా వాటిని ప్రారంభించారు. 13 కేంద్రాల్లో 753 మంది విద్యార్థులు పలుక్రీడల్లో భాగస్వాములవుతున్నారు. చిన్నకోడూర్లో ఖోఖోకు 30 మంది, మద్దూర్లో హ్యాండ్బాల్కు 60 మంది, బస్సాపూర్ల్లో జూడోకు 69 మంది, మర్పడగలో సాఫ్ట్బాల్ 25 మంది, మల్లంపల్లిలో వాలీబాల్ 30 మంది, రాగావపూర్లో అథ్లెటిక్స్లో 45 మంది, జగదేవ్పూర్ కరాటేలో 130 మంది, సిద్దిపేటలో ఫుట్బాల్లో 50 మంది, దుబ్బాకలో వాలీబాల్లో 34 మంది, కోహెడ అథ్లెటిక్స్లో 45 మంది, మిరుదొడ్డి బాల్ బ్యాడ్మింటన్ 40 మంది, గజ్వేల్ పుట్బాల్లో 115 మంది, సిద్దిపేట స్విమ్మింగ్లో 80 మంది విద్యార్థులు సమ్మర్ క్యాంపు క్రీడల్లో పాల్గొంటుండగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు క్రీడలపై శిక్షణ ఇస్తున్నారు.
విద్యార్థులో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు..
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ సమ్మర్ క్యాంపు క్రీడలు ఎంతోగానో దోహదపడుతాయి. అందుకు అనుగుణంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలను మే ఒకటి నుంచి ప్రారంభించారు. జిల్లాలోని అనుభవజ్ఞులైన పీడీ, పీఈటీల ఆధ్వర్యంలో ఈ క్రీడలపై విద్యార్థులకు మెళకువలను నేర్పిస్తున్నారు. ఇందులో 14 ఏండ్ల లోపు విద్యార్థులకు అవకాశం లభించింది. జిల్లాలో కొనసాగుతున్న కేంద్రాల్లో ఈ యేడు సిద్దిపేటలో ఈత నేర్పించడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో భాగస్వాములవుతున్నారు. ప్రతి రెండు విడతలుగా కేంద్రాల్లో ఆటలు ఆడిస్తున్నారు. విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటూ తన నైపుణ్యానికి పదును పెడుతున్నారు. చివరి రోజున ఇందులో భాగస్వాములైన వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు.
జిల్లాలో విద్యార్థుల నుంచి విశేష స్పందన
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడలకు జిల్లాలోని 13 కేంద్రాల్లో విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. వివిధ రకాల క్రీడల్లో ఎంతో ఉత్సాహంతో విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మే 30 వరకు కొనసాగే ఈ క్రీడలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను అందజేస్తాం.
-జోన్నల నాగేందర్, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి