గజ్వేల్ అర్బన్, నవంబర్ 20 : ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో సీఎం కేసీఆర్ నడిచి 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని వైష్ణవి గార్డెన్స్లో విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మలంతా సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం సభకు హాజరైన మంత్రి హరీశ్రావుకు మద్దతు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సూచించిన నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన సిద్ధాంతాన్ని సీఎం కేసీఆర్ నమ్మి 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తూ రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. అలాం టి జయశంకర్సార్ను పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవమానించారన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమంలో మొదట లేవని, మధ్యలో ఎవడో తెచ్చాడంటూ జయశంకర్సార్ను రేవంత్రెడ్డి తీవ్రంగా అవమానించారన్నారు. ఉద్యమం అంటే తెలియని వాళ్లు, దేశం అంటే గౌరవం లేని వాళ్లు ఇలాగే మాట్లాడతారని చెప్పారు. గజ్వేల్లో ఏనాడూ సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. ఇప్పుడు ఓట్ల కోసం గజ్వేల్లో తిరుగుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు గజ్వేల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఇన్నిరోజులు గజ్వేల్కు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుంటే వారు జీర్ణించుకోలేదని, ఇప్పుడు గజ్వేల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుక్కోవడానికి వచ్చారన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్లో రైల్వేలైన్, పాండవుల చెరువు అభివృద్ధి, ఐవోసీ భవనాలు, ఎడ్యుకేషన్ హబ్, సమీకృత మార్కెట్, దవాఖానలు, గురుకులాలు, రహదారులను నిర్మించి ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. అభివృద్ధిలో గజ్వేల్ను సీఎం కేసీఆర్ వం దేండ్లు ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.
కేసీఆర్ గజ్వేల్కు ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని, కేసీఆర్తోనే గజ్వేల్కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ తొలి సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అయితే, తొలి స్పీకర్ విశ్వకర్మ మధుసూదనాచారి అని తెలిపారు. ఈటల రాజేందర్ ఇప్పుడు గజ్వేల్కు వచ్చి మస్తు మాట్లాడుతున్నారని, ఆయన తిన్నింటి వాసాలు లెక్కపెట్టెటోడన్నారు. ఈటలకు గుర్తింపునిచ్చింది సీఎం కేసీఆరేనన్నారు. ఈటలను ఎమ్మెల్యే, మంత్రి, శాసనసభ పక్షనేతను చేసింది సీఎం కేసీఆరేనని, ఆ విషయాన్ని ఆయన మర్చిపోయాడన్నారు. అన్నం పెట్టిన చేతికి ఈటల సున్నం పెడుతున్నాడన్నారు. కరోనా సమయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒక్కరైనా బయటకు వచ్చారా..? అంటూ మంత్రి ప్రశ్నించారు. ఈనెల 30 వరకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కనిపిస్తారని, ఆ తర్వాత ఉండరని, కానీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులే మీ కండ్లముందు కనిపిస్తారని తెలిపారు.
కేసీఆర్ గజ్వేల్కు ఒక వరమని, ఆయన్ను మరోసారి గెలిపిస్తే దక్షిణ భారతదేశంలో మొదటి హ్యాట్రిక్ సీఎంగా చరిత్రకెక్కి మరో గౌరవం గజ్వేల్కు దక్కుతుందన్నారు. విశ్వకర్మలు కోరుకున్నట్లు సిద్దిపేటలో మాదిరిగా గజ్వేల్లోనూ జయశంకర్ భవనాన్ని నిర్మించుకుందామన్నారు. సీఎం కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం విశ్వకర్మల సంప్రదాయ వాయిద్యమైన రుంజను మం త్రి హరీశ్రావు వాయించారు. కార్యక్రమంలో ఎమ్మె ల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కుకునూర్పల్లి సర్పంచ్ జయంతి నరేందర్, మర్కూక్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాల్రాజు, గజ్వేల్ పట్టణ యు వత అధ్యక్షుడు స్వామిచారి, విశ్వకర్మ సం ఘం అధ్యక్షుడు వెంకట్చారి, ఉపాధ్యక్షులు వెంకటేశ్చారి, ప్రధాన కార్యదర్శి విఠల్చారి, నాగరాజుచారి, పల్లెపహాడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాసాచారి, అరవిందాచారి, డాక్టర్ పెంటాచారి, డాక్టర్ వాసవాచారి, నాయకులు, విశ్వకర్మలు పాల్గొన్నారు.