అన్ని మతాలకు తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నది. పండుగలను పేదలు సైతం సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నూతన వస్ర్తాలను కానుకగా అందజేస్తున్నది. ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్ పర్వదినం సమీపిస్తుండడంతో వారికి గిఫ్ట్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. మెదక్ జిల్లాలో 4000 కానుకలు అందజేయనుండగా, ఇఫ్తార్ విందు కోసం రూ. 8 లక్షలు మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 24 మసీదుల పరిధిలో 12వేల మందికి గిఫ్ట్లు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇఫ్తార్ కోసం ప్రభుత్వం రూ.24లక్షలు కేటాయించింది. ఇప్పటికే కానుకలు జిల్లాలకు చేరుకోగా తహసీల్ కార్యాలయాల్లో భద్రపరిచారు. త్వరలోనే ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.
మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, ఏప్రిల్ 7: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్ల పంపిణీకి బీఆర్ఎస్ సరారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఆయా జిల్లాలకు కానుకలు చేరాయి. వీటి పంపిణీకి జిల్లా మైనార్టీశాఖ ఆధ్వర్యంలో అధికారులు అర్హులను గుర్తించి, ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 4 వేల గిఫ్ట్ ప్యాక్లు, సంగారెడ్డి జిల్లాలో 12 వేల కానుకలను అందజేయనున్నారు. త్వరలోనే స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు జిల్లా వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో రెండు నియోజవకర్గాలు ఉండగా, నాలుగు మున్సిపాలిటీలున్నాయి. మెదక్ నియోజకవర్గంలో 2500 మందికి, నర్సాపూర్ నియోజకవర్గంలో 1500 మందికి రంజాన్ కానుకలు అందజేయనున్నారు.
ఒక్కో కమిటీకి రూ.లక్ష..
మెదక్ జిల్లా వ్యాప్తంగా 8 మసీదు మేనేజింగ్ కమిటీలున్నాయి. ఒక్కో కమిటీకి 500 చొప్పున గిఫ్ట్ ప్యాకెట్లను, ఇఫ్తార్ విందు కోసం రూ.లక్ష చొప్పున 8 మసీదు కమిటీలకు రూ.8 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మైనార్టీ శాఖ జిల్లా అధికారి జెంలానాయక్ తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 5 మసీదు కమిటీలు ఉండగా, మెదక్లో 3, రామాయంపేటలో 1, పాపన్నపేటలో 1 ఉండగా, నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్లో 1, కౌడిపల్లిలో 1, హత్నూర మండలం దౌల్తాబాద్లో 1 మసీద్ కమిటీలు ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాకు 12 వేల కానుకలు..
సంగారెడ్డి జిల్లాలో 5 నియోజకవర్గాలకు గాను పటాన్చెరు మినహా మిగతా నాలుగు నియోజకవర్గాల్లో 24 మసీదుల పరిధిలో 12వేల రంజాన్ కానుకలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మసీదుకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఇఫ్తార్ విందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాలకు చేరిన కానుకలను భద్రపరిచారు. త్వరలో ముస్లిం పేదలను గుర్తించి అందజేయనున్నారు.
ఇఫ్తార్ విందుకు రూ.24లక్షలు..
ముస్లింల పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కానుకలతో పాటు ఇఫ్తార్ విందుకు నిధులు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు కోసం రూ.24 లక్షలను కేటాయించనున్నది. నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన ఆయా ఎమ్మెల్యేలు ఇచ్చిన సమయం ప్రకారం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
కుటుంబ పెద్దలకు బట్టలు…
పేద ముస్లింలు కొత్తబట్టలతో పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కానుకలు అందిస్తున్నది. గిప్ట్ ప్యాక్లో పురుషుడికి కుర్థా, పైజామా, మహిళలకు చీర, జాకెట్టుతో పాటు లేడిస్ షూట్ కలిగిన ప్యాక్లు పంపిణీ చేస్తున్నది. ఇదివరకు పండుగకు ముందే ఇఫ్తార్ విందుభోజనం ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది సీఎం కేసీఆర్ అధికారికంగా అందజేస్తున్న రంజాన్ పండుగ కానుకలపై ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కానుకలు ఇవ్వడం సంతోషకరం..
ప్రభుత్వం పేద ముస్లింలకు కానుకలు ఇవ్వడం సంతోషకరం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రతి ఏడాది కానుకలతో పాటు ఇఫ్తార్విందు ఏర్పాటు చేస్తున్నారు. ప్రార్థన మందిరాలు మసీదుల వారీగా గుర్తించిన పేదలకు గిప్ట్ప్యాకెట్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం ఆనందకరం. ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు సహృదయంతో ముస్లిం మైనార్టీల ఆశీస్సులు ఉంటాయి.
– హఫేస్ అజహర్, అబ్బు హనీఫా మసీదు సంగారెడ్డి
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కానుకలు పంపిణీ చేస్తాం..
రంజాన్ కానుకల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4వేల రంజాన్ కానుకలు వచ్చాయి. వాటిని మసీదు మేనేజింగ్ కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని సూచించాం. ఇప్పటికే ఆయా మసీదు కమిటీలకు రంజాన్ కానుకలను సరఫరా చేశాం. ఎమ్మెల్యేల సమక్షంలో రంజాన్ కానుకలను పంపిణీ చేస్తాం.
– జెంల్లానాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి, మెదక్
జిల్లాకు చేరిన 12 వేల కానుకలు…
సంగారెడ్డి జిల్లాకు12 వేల గిప్ట్ప్యాక్లు వచ్చాయి. అర్హులైన పేద ముస్లింలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం. జిల్లాలో ఉన్న 5 నియోజక వర్గాలకు 4 నియోజకవర్గాల్లోని 24 మసీదుల పరిధిలో ముస్లింలకు కానుకలు వచ్చాయి. పటాన్చెరు నియోజకవర్గం గ్రేటర్ పరిధిలో ఉన్నందున అక్కడే పంపిణీకి ఏర్పాట్లు చేస్తారు. ఇఫ్తార్విందు ఏర్పాటు చేసి మతపెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేశాం.
– అరుణ్కుమార్, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, సంగారెడ్డి