హుస్నాబాద్, జనవరి 7: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దేనని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014కు ముందు నిరాశ, నిస్పృహలతో ఉన్న ప్రజలను చైతన్యం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పదేండ్లలో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు. రాష్ర్టాన్ని బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్కు అప్పగిస్తే వారు అసత్య ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడితే కాంగ్రెస్ అడ్డుకున్నదన్నారు. పదేండ్లలో 1.61 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి, మరో 43వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 2లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల్లో గెలిచినా ఓడినా కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో చైతన్యవంతులని, కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశామని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, వాటిని ప్రజలు గుర్తించలేక పోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చుతుందో ప్రజలు త్వరలోనే గుర్తిస్తారన్నారు. గ్రామస్థాయి నుంచి మరోసారి పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలను కోరారు. సమావేశంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు గోపాల్రావు, పన్యాల భూపతిరెడ్డి, కర్ర శ్రీహరి, దేవేందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మీ, కొక్కుల కీర్తి, అనిత, స్వప్న, నాయకులు వెంకట్రాంరెడ్డి, అన్వర్, ఆవుల మహేందర్, మామిడి అంజయ్య, ఆకుల వెంకట్, ఏడు మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.