పటాన్చెరు, జూన్ 20 : మనది.. ఆరోగ్య తెలంగాణ అని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. పటాన్చెరు పట్టణంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన స్థలాన్ని ఆయన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్లతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరోగ్యరంగంలో అద్భుతమైన ప్రగతిని కనబరుస్తున్నదన్నారు.
రూ. 15వందల కోట్లతో నిమ్స్ దవాఖానను రెండు వేల పడకలకు అభివృద్ధి చేస్తున్నామన్నారు. హన్మకొండలోనూ రూ. 15వందల కోట్లతో దవాఖానాను అభివృద్ధ్ది చేయడం జరుగుతున్నదన్నారు. కొవిడ్ సమయంలో 14 వందల ఐసీయూ బెడ్లు మాత్రమే ఉండేవన్నారు. ఇప్పుడు తెలంగాణలో 29 వేల ఐసీయు ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. త్వరలో 50వేల బెడ్లు అందుబాటులోకి తీసుకొని రాబోతున్నామన్నారు. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లు చేసే విమర్శలు అర్ధరహితం అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ దేశంలో 156 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని వాటిలో ఒక్కటి కూడా తెలంగాణకు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం సభను విజయవంతం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.