జిల్లాలో 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కాయకల్ప అవార్డులు
రన్నరప్గా గజ్వేల్ జిల్లా దవాఖాన.. ప్రోత్సాహకంగా రూ.10లక్షలు
సిద్దిపేట పట్టణంలోని నాసర్పురా, అంబేద్కర్నగర్ యూపీహెచ్సీలకు ప్రోత్సాహకాలు
సిద్దిపేట, జూలై 15 : ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ప్రజలకు అందించే వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమంగా నిలిచినటువంటి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రా లు, జిల్లా దవాఖాన, 4 సబ్సెంటర్లు కాయకల్ప అవార్డులకు ఎంపికైనట్లు జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తెలిపారు. జిల్లాలో 7 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 4 సబ్సెంటర్లు, ఒక జిల్లా దవాఖాన అవార్డులు అందుకున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ వైద్య సేవలు, పేషెంట్ సపోర్ట్ సర్వీసు, క్లీనికల్ కేర్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, క్వాలిటీ మేనేజ్మెంట్, పరిశుభ్రత పాటించినందుకు 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కాయకల్ప అవార్డు లభించాయి. జిల్లాలో అత్యధికంగా 82.6 పాయింట్లతో బెజ్జంకి పీహెచ్సీ విన్నర్గా నిలిచి రూ.2 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందుకుంటుంది.
రాజగోపాల్పేట పీహెచ్సీ 80.8 పాయింట్లు, తిమ్మాపూర్ పీహెచ్సీ 80.0, పుల్లూరు పీహెచ్సీ 77.5, కోహెడ పీహెచ్సీ 76.7, తీగుల్ పీహెచ్సీ 74.2, వర్గల్ పీహెచ్సీ 72.5 పాయింట్లు సాధించి రూ.50 వేల నగదు ప్రోత్సాహానికి ఎంపికయ్యాయి. సిద్దిపేట పట్టణంలోని నాసర్పుర ప్రైమరీ హెల్త్ సెంటర్ రూ.2 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని, అంబేద్కర్నగర్ యూపీహెచ్సీకి రూ.50వేల నగదు ప్రోత్సాహం లభించింది. హెల్త్ వెల్నెస్ సెంటర్ సబ్సెంటర్ల పరిధిలో వట్టిపల్లి రూ.లక్ష, రామవరం సబ్సెంటర్ రూ.50 వేలు, మునిగడప సబ్సెంటర్ రూ.35 వేలు, వరదరాజుపల్లి సబ్సెంటర్ రూ. 25 వేల నగదు ప్రోత్సాహాన్ని పొందాయి. గజ్వేల్ జిల్లా వైద్యశాల రన్నరప్గా నిలిచి, రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. 2022-23 సంవత్సరంలో జిల్లా వందశాతం దవాఖానలు కాయకల్ప అవార్డులు అందుకునేలా కృషి చేయాలని సూచించారు.